న్యూఢిల్లీ, నవంబర్ 9: హెల్త్కేర్ దిగ్గజం అపోలో హాస్పిటల్స్ భారీ విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. దేశవ్యాప్తంగా నాణ్యమైన హెల్త్కేర్ సర్వీసులకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా వచ్చే మూడేండ్లలో రూ.3,435 కోట్ల మూలధన పెట్టుబడులతో ప్రస్తుత సామర్థ్యానికి తోడు మరో 2,300 పడకలు జత చేయనున్నట్టు తెలిపింది. గురువారం సమావేశమైన కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఈ మేరకు ఇన్వెస్ట్మెంట్ కమిటీ సిఫార్సుల్ని ఆమోదించింది.
325 పడకల సామర్థ్యంతో పాక్షికంగా నిర్మాణమైన ఒక హాస్పిటల్ను ఇటీవల అపోలో కొనుగోలు చేసింది. దీంతో దేశంలోని తూర్పు ప్రాంతంలో అపోలో హాస్పిటల్స్ బెడ్స్ సంఖ్య 1,800కు పెరిగింది. రానున్న మూడేండ్లలో ఈ సంఖ్యను 2,500కు పెంచాలన్నది ప్రతిపాదన. అలాగే పుణెలో 250 బెడ్స్ కలిగిన ఒక కొత్త హాస్పిటల్ను కొనేందుకు కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. దీనిని 425 బెడ్స్ వరకూ విస్తరించే అవకాశం ఉంటుంది. దేశంలోని కీలక ప్రాంతాల్లో అదనంగా 2,300 బెడ్స్ను యాడ్ చేయడం తమ ప్రణాళికాని అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి తెలిపారు.
సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో అపోలో హాస్పిటల్స్ నికరలాభం 14.2 శాతం వృద్ధిచెంది రూ. 233 కోట్లకు చేరింది. సంస్థ ఆదాయం సైతం 14 శాతం పెరిగి రూ. 4,847 కోట్లకు చేరింది. ఈబిటా రూ.565 కోట్ల నుంచి రూ. 627 కోట్లకు చేరింది.