ముంబై, డిసెంబర్ 5: దేశంలో ద్రవ్యోల్బణం గరిష్ఠస్థాయిలో కొనసాగడం, ప్రపంచ ప్రధాన కేంద్ర బ్యాంక్లు ద్రవ్య విధానాన్ని మరింత కఠినతరం చేస్తున్న నేపథ్యంలో వడ్డీ రేట్లను రిజర్వ్బ్యాంక్ పెంచవచ్చని మెజారిటీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జూన్ నుంచి ఇప్పటివరకూ మూడు దఫాలు 50 బేసిస్ పాయింట్ల చొప్పున రేట్లను పెంచిన ఆర్బీఐ మరో 0.35 శాతం రెపో రేటును తాజాగా పెంచుతుందని భావిస్తున్నారు. అంతకు ముందు మే నెలలో హఠాత్తుగా 40 బేసిస్ పాయింట్ల రేట్లను పెంచింది. ఇప్పటివరకూ 190 బేసిస్ పాయింట్లు (1.9 శాతం) రేట్లు పెరిగాయి. రిజర్వ్బ్యాంక్ రేట్లను నిర్ణయించే కమిటీ మూడు రోజుల సమావేశం సోమవారం ప్రారంభమయ్యింది. మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) విధానాన్ని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ఈ నెల 7న వెల్లడిస్తారు.
6.25 శాతానికి రెపో రేటు
డిసెంబర్ పాలసీ సమీక్షలో ఆర్బీఐ వడ్డీ రేటును 0.35 బేసిస్ పాయింట్ల మేర పెంచవచ్చని, దీంతో రెపో రేటు 6.25 శాతానికి చేరుతుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన రీసెర్చ్ రిపోర్ట్లో అంచనా వేసింది. ప్రస్తుతం పాలసీ రేటు 5.9 శాతం ఉంది. వాస్తవానికి 50 బేసిస్ పాయింట్ల మేర పెంపు ఉంటుందన్న అంచనాలు కొద్ది రోజుల క్రితం వరకూ ఉన్నాయని, ద్రవ్యోల్బణం నెమ్మదిస్తున్న సంకేతాలు కన్పిస్తున్నందున ఈ దఫా పెంపు తక్కువగానే ఉంటుందని ఎస్బీఐ రీసెర్చ్ చీఫ్ ఎకనామిక్ అడ్వయిజర్ సౌమ్య కాంతి ఘోష్ తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్లో 7.41 శాతం ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్లో 6.77 శాతానికి దిగింది. అయినప్పటికీ ఆర్బీఐ నిర్దేశిత లక్ష్యమైన 6 శాతానికి ఎగువనే ఇది కొనసాగుతున్నందున, వడ్డీ రేట్లు 25-35 బేసిస్ పాయింట్ల మధ్యలో పెరుగుతాయని కొందరు ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. డిమాండ్ మందగిస్తున్న నేపథ్యంలో తక్కువ మోతాదులో రేట్లు పెంచే యోచనను అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పొవెల్ ఇటీవల వెల్లడించారు. 75 బేసిస్ పాయింట్ల చొప్పున మూడు దఫాలు రెట్లను పెంచిన ఫెడ్ డిసెంబర్ మూడోవారం జరిపే సమీక్షలో 50 బేసిస్ పాయింట్లనే పెంచుతుందన్న అంచనాలు నెలకొన్న నేపథ్యంలో ఆర్బీఐ సైతం పెంపును 35 బేసిస్ పాయింట్ల మేరకే పరిమితం చేస్తుందని భావిస్తున్నారు.
కమిటీలో భిన్నాభిప్రాయాలు
ఆర్బీఐ గత సమీక్ష సందర్భంగా మానిటరీ కమిటీ సభ్యులు రేట్ల పెంపుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినట్టు సెప్టెంబర్ పాలసీ మీటింగ్ మినిట్స్ ద్వారా వెల్లడయ్యింది. డిసెంబర్ సమావేశంలో పెంపునకు విరామం ఇవ్వాలని ఎంపీసీ సభ్యుడు డాక్టర్ జయంత్ వర్మ వాదించగా, డాక్టర్ గోయల్ మాత్రం మరిన్ని రేట్ల పెంపులు జరగాలన్నారు.