BharatPe | మొబైల్ యాప్ సంస్థ ‘భారత్పే’కు మరో ఎదురు దెబ్బ తగలనున్నది. సంస్థ మాజీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) ధ్రువ్ బాల్.. వచ్చే నెలలో భారత్పే నిష్కమించనున్నారు. ఇటీవలే సంస్థ యాజమాన్యం ఆయనను మర్చంట్ లెండింగ్ డివిజన్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్గా నియమించింది. గత ఏడాదిన్నర కాలంగా భారత్పే నుంచి సీనియర్ ఎగ్జిక్యూటివ్లు నిష్క్రమిస్తున్నారు. దాదాపు 12 మందికి పైగా ఎగ్జిక్యూటివ్ లు.. అందునా టెక్, ప్రొడక్ట్ టీమ్స్కు లీడర్లుగా వ్యవహరిస్తున్న వారే వైదొలగడం గమనార్హం. భారత్పే కో-ఫౌండర్ అశ్నీర్ గ్రోవర్ నిష్క్రమణ తర్వాత సంస్థ కార్యకలాపాల పునర్వ్యవస్థీకరణలో బాల్ కీలక పాత్ర పోషించారు. 2020లో సంస్థ ఆపరేషన్ల విభాగం అధిపతిగా చేరారు.
ధ్రువ్ బాల్ తాను సొంతంగా ఇన్వెస్ట్మెంట్ సంస్థ ఏర్పాటు చేయాలని తలపెట్టినట్లు సమాచారం. సొంతం వెంచర్ ప్రారంభించాలని యోచిస్తున్నారని తెలుస్తున్నది. ఆయనకు భారత్ పే పూర్వ సహచరులుగా ఉన్న భావిక్ కొలడియా, సుహైల్ సమీర్ కూడా మద్దతు ఇస్తున్నారని తెలియవచ్చింది. ఆర్థిక లావాదేవీల్లో అవకతవకల నేపథ్యంలో 2022 జనవరిలో అశ్నీర్ గ్రోవర్ సంస్థకు రాజీనామా చేశారు. సంస్థ ఆర్థిక అవకతవకలపై దర్యాప్తు జరిపిన కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ).. భారత్పే పై జరిమాన కూడా విధించింది. ప్రారంభంలో జరిగిన స్కాండల్స్ నుంచి కోలుకోవడానికి భారత్పే ఆపసోపాలు పడుతోంది.