న్యూఢిల్లీ, డిసెంబర్ 14: ఈ ఏడాది ఇండ్ల అమ్మకాలు గత ఏడాదితో పోల్చితే 38 శాతం పెరిగే వీలుందని ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ తెలిపింది. హైదరాబాద్సహా దేశంలోని ఏడు ప్రధాన నగరాల రియల్టీ మార్కెట్పై అనరాక్ తాజాగా తమ అంచనాల్ని వెలిబుచ్చింది. ఈ క్రమంలోనే హైదరాబాద్, ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై-ఎంఆర్, కోల్కతా, చెన్నై, బెంగళూరు, పుణె నగరాల్లో గత ఏడాది రూ. 3,26,877 కోట్ల హౌజింగ్ సేల్స్ జరిగాయని, ఈ ఏడాది మాత్రం ఈ నగరాల్లో రూ.4.5 లక్షల కోట్లకు విక్రయాలు పెరుగవచ్చన్నది.
ఇప్పటికే ఈ సంవత్సరం జనవరి-సెప్టెంబర్ మధ్య రూ.3,48,776 కోట్ల విలువైన ఇండ్ల అమ్మకాలు జరిగాయని పేర్కొన్నది. 2022తో చూస్తే 7 శాతం ఎక్కువన్నది. దీంతో నిరుడు సేల్స్ను ఇప్పటికే అధిగమించి రియల్ ఎస్టేట్ మార్కెట్ పరుగులు పెడుతున్నదని గుర్తుచేసింది. ఈ నేపథ్యంలోనే ఈ నెలాఖరుతో ముగిసే మూడు నెలల్లో మరో లక్ష కోట్ల రూపాయల హౌజింగ్ సేల్స్కు ఆస్కారముందన్న అభిప్రాయాన్ని అనరాక్ వ్యక్తం చేసింది.
హైదరాబాద్లో 43 శాతం
ఈ జనవరి-సెప్టెంబర్లో నిరుడుతో పోల్చితే హైదరాబాద్లో ఇండ్ల అమ్మకాలు 43 శాతం పెరిగినట్టు అనరాక్ తెలియజేసింది. విలువ రూ.25,001 కోట్ల నుంచి రూ.35,802 కోట్లకు ఎగిసింది. కాగా, పుణెలో అత్యధికంగా 96 శాతం వృద్ధి నమోదైంది. చెన్నైలో 45 శాతం, బెంగళూరులో 42 శాతం, ముంబై-ఎంఆర్లో 41 శాతం, ఢిల్లీ-ఎన్సీఆర్లో 29 శాతం, కోల్కతాలో 19 శాతం పెరిగాయి.
ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల్లో జరిగిన ఇండ్ల అమ్మకాలు.. గత ఏడాది మొత్తంగా నమోదైన హౌజింగ్ సేల్స్ను మించిపోయాయి. దీన్నిబట్టి ఇండ్లకు డిమాండ్ పెద్ద ఎత్తున ఉందన్నది అర్థమవుతున్నది. ముఖ్యంగా ప్రీమియం లగ్జరీ నివాసాలకూ ఆదరణ పెరగడం గమనార్హం. ఇదే సమయంలో దేశంలోని టాప్-7 నగరాల్లో ధరలు సగటున 8-18 శాతం పెరిగాయి.
ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.1,12, 976 కోట్ల సేల్స్ ఉన్నాయి. అయితే రెండో త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో 1 శాతం పెరిగితే, మూడో తైమాసికం (జూలై-సెప్టెంబర్)లో ఏకంగా 8 శాతం వృద్ధి కనిపించింది. చివరి త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్) పండుగ సీజన్ కావడంతో అమ్మకాలు మరింతగా ఉంటాయనే అంచనా. కాబట్టే ఈ ఏడాది రూ.4.5 లక్షల కోట్ల హౌజింగ్ సేల్స్కు వీలుందనిపిస్తున్నది.
-అనుజ్ పురి అనరాక్ గ్రూప్ చైర్మన్