Medical College in Hyderabad | తెలంగాణ రాజధాని హైదరాబాద్లో మరో మెడికల్ కాలేజీ రానున్నది. మహీంద్రా గ్రూప్ ఆధ్వర్యంలోని మహీంద్రా యూనివర్సిటీలో ఈ వైద్య కళాశాల రానున్నది. ఉక్రెయిన్, ఫిలిప్పీన్స్, అజర్బైజాన్, జాగ్రెబ్ (క్రోయేషియా) తదితర దేశాల్లో తక్కువ ఫీజులకే వైద్యవిద్య ఆఫర్ చేస్తున్నారు. దీంతో భారతీయుల్లో చాలా మంది తమ ఆకాంక్షలను నెరవేర్చుకోవడానికి తరలి వెళుతున్నారు. తాజాగా ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర నేపథ్యంలో అక్కడ వైద్యవిద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను మూకుమ్మడిగా తరలించాల్సి వచ్చింది. దీంతో దేశంలో ప్రైవేట్ రంగంలో వైద్య విద్యా వసతులు మెరుగు పర్చాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ప్రధాని పిలుపు మేరకు స్పందించిన తొలి కార్పొరేట్ సంస్థ అధినేత ఆనంద్ మహీంద్రా నిలిచారు.
భారత్లో వైద్యవిద్యాకళాశాలల కొరతపై తనకు సమాచారం లేదని గురువారం ట్వీట్ చేశారు. ఈ ట్వీట్కు టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానీని ట్యాగ్ చేశారు. మహీంద్రా యూనివర్సిటీలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడానికి గల అవకాశాలను పరిశీలించాలని కోరారు.
ఆనంద్ మహీంద్రా ట్వీట్పై ట్విట్టరీలు ఆసక్తిగా స్పందించారు. ఇతర ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో మాదిరిగా రూ.కోట్లలో ఫీజులు వసూలు చేయొద్దని కోరారు. ఈ సూచనను ఆనంద్మహీంద్రా పరిగణనలోకి తీసుకుంటారని అభిప్రాయ పడ్డారు.
ప్రస్తుతం హైదరాబాద్లో కొలువుదీరిన మహీంద్రా యూనివర్సిటీ క్యాంపస్లో ఇంజినీరింగ్, లా అండ్ మేనేజ్మెంట్, మీడియా, లిబరల్ ఆర్ట్స్ విభాగాల్లో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు ఆఫర్ చేస్తున్నది. భారత్లో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేయడానికి అవసరమైన భూమిని కేటాయించడానికి మంచి విధానాలు రూపొందించాలని ఆనంద్ మహీంద్రా సూచించారు. అలా చేస్తే భారీ సంఖ్యలో వైద్యులు, పారా మెడికల్ సిబ్బందిని అందుబాటులోకి తేవొచ్చునన్నారు.
దేశంలో వైద్యవిద్యను అభ్యసించాలని భావించే విద్యార్థులకు అధిక ఫీజులు, సీట్ల కొరత జంట సవాళ్లుగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో 90వేల సీట్లు ఉన్నాయి. గతేడాది వైద్యవిద్యలో అడ్మిషన్లకు నిర్వహించే నీట్ పరీక్షకు 16 లక్షల మంది దరఖాస్తు చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఫీజుల్లోనూ చాలా తేడా ఉంది. ప్రభుత్వ కళాశాలల్లో రూ.67,000- రూ.3 లక్షల మధ్య ఉంది. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో రూ.కోటి వరకు ఖర్చవుతున్నది.