Amul : దేశంలో డైరీ ఉత్పత్తుల్లో అగ్ర సంస్థగా ఉన్న అమూల్ అరుదైన ఘనత సాధించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో లక్ష కోట్ల వ్యాపార సంస్థగా నిలిచింది. ఈ ఏడాది సంస్థ ఏకంగా 11 శాతం వృద్ధి సాధించింది. అమూల్.. గుజరాత్కు చెందిన సంస్థ. ద గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ (జీసీఎంఎంఎఫ్) సంస్థ అమూల్ బ్రాండ్తో వ్యాపారం నిర్వహిస్తుంటుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 11 శాతం వృద్ధితో, లక్ష కోట్లకుపైగా వ్యాపారాన్ని నిర్వహించినట్లు సంస్థ తాజాగా ప్రకటించింది.
ఈ సంస్థ ఇంతకుముందు 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.90,000 కోట్ల వ్యాపారం సాధించింది. ఇప్పుడు దీన్ని అధిగమించి, భారీ లాభాలతో లక్ష కోట్లు దాటింది. అమూల్.. దేశంలో టాప్ డైరీ బ్రాండ్గా కొనసాగుతోంది. ఈ సంస్థ దాదాపు 1,200 రకాల ఉత్పత్తుల్ని మార్కెటింగ్ చేస్తోంది. ఆధునిక వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు తన మార్కెటింగ్ వ్యూహాల్ని మార్చుకుంటూ వస్తోంది. ఈ ఫెడరేషన్లో 18 జిల్లా కో ఆపరేటివ్ సంస్థలు కూడా సభ్యత్వం కలిగి ఉన్నాయి. భారీ లక్ష్యా్న్ని చేరుకున్న సందర్భంగా జీసీఎంఎంఎఫ్ చైర్మన్ అశోక్భాయ్ చౌదరి స్పందించారు. లక్షలాది మంది వినియోగదారులు, నిరంతరం శ్రమించే 36 లక్షల మంది రైతుల నమ్మకం కారణంగా ఈ విజయం సాధ్యమైందన్నారు.
జీసీఎంఎంఎ సంస్థ దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా అతిపెద్ద డైరీ సంస్థ. ఇందులో 36 లక్షల మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. పాలు, పాల ఉత్పత్తుల్ని 50కిపైగా దేశాల్లో విక్రయిస్తోంది. స్పెయిన్ సహా యూరప్ దేశాల్లో, అమెరికాలోనూ వ్యాపారం చేస్తోంది. రోజూ 31 మిలియన్ లీటర్ల పాలను సేకరిస్తోంది. సంవత్సరానికి 24 బిలియన్ల ప్యాకెట్లు విక్రయిస్తోంది. వీటిలో పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, ఐస్ క్రీమ్ వంటి పలు పదార్థాలున్నాయి.