Amitabh Kant-Tesla | భారత్ మార్కెట్లోకి గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ ‘టెస్లా’ ఎంట్రీపై నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అమితాబ్ కాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి విద్యుత్ కంపెనీ కోసం భారత్ వేర్వేరు విధానాలు అవలంభించబోదని స్పష్టం చేశారు. గత నెలలో భారత్లో టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ పర్యటించాల్సి ఉన్నా, చివరిక్షణంలో ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో భారత్ మార్కెట్లోకి టెస్లా కార్ల రంగ ప్రవేశంపై అమితాబ్ కాంత్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.
‘అన్ని కంపెనీల కోసం కేంద్రం ఈవీ పాలసీ రూపొందించింది. ఈ పాలసీని కంపెనీలు అనుసరించాల్సిందే. కొన్ని ప్రత్యేకమైన సంస్థల కోసం కేంద్ర ప్రభుత్వం తన విధానంలో మార్పులు చేయదు’ అని అమితాబ్ కాంత్ చెప్పారు. తమ కంపెనీ కోసం టెస్లా కొన్ని ప్రత్యేక డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ముంగిట పెట్టనున్నదన్న వార్తల నేపథ్యంలో అమితాబ్ కాంత్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. భారత్లో కార్ల తయారీ యూనిట్లను ఏర్పాటు చేయడానికి వీలుగా ఈవీ పాలసీలో ఇన్సెంటివ్లు ప్రకటించారు.
భారత్లో కనీసం రూ.4150 కోట్ల (500 మిలియన్ డాలర్లు) పెట్టుబడి పెట్టే ఈవీ సంస్థలకు రాయితీలు అందిస్తామని కేంద్రం తెలిపింది. కేంద్రం పాలసీ ప్రకారం దేశంలో ‘ఈవీ కార్ల తయారీ యూనిట్’ ఏర్పాటు చేయాలి. లేదా దేశీయంగా తయారైన విడి భాగాల్లో 25 శాతం వినియోగించాలి. ఐదేండ్ల తర్వాత 50 శాతం విడి భాగాలు దేశీయంగా తయారైనవే వాడాలి. కేంద్రం కొత్త ‘ఈవీ పాలసీ’ ప్రకారం భారత్లో కార్ల తయారీ సంస్థ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చే వారి కార్ల దిగుమతిపై సుంకాలు లేదా దిగుమతి సుంకం 15 శాతం వసూలు చేస్తారు.