Koo to Twitter | ట్విట్టర్ న్యూబాస్ ఎలన్ మస్క్ తీసుకుంటున్న నిర్ణయాలతో ఆ సంస్థ పూర్తి సంక్షోభంలో చిక్కుకుంటున్నది. గత నెలాఖరులో 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్ సంస్థను టేకోవర్ చేసిన ఎలన్ మస్క్.. ట్విట్టర్లో సగం మందిని ఇంటికి సాగనంపేశారు. ఎక్కువ పని గంటలు పని చేయాలనడం, వర్క్ ఫ్రం హోం సేవలు ఎత్తేయడంతో కొందరు ఎగ్జిక్యూటివ్లు స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. దీంతో ట్విట్టర్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ పరిస్థితుల్లో ఇండియాలో ట్విట్టర్ ప్రత్యర్థి యాప్ ‘కూ’.. మాజీ ట్విట్టర్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ట్విట్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసిన వారిని తాము నియమించుకుంటామని పేర్కొంది. ఇండియాలో మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్గా రూపు దిద్దుకుంటున్న కూ ఇటీవల కొత్తగా నాలుగు ఫీచర్లు జత చేసింది.
‘కూ’ సేవలను విస్తరించ తలపెట్టినట్లు సంస్థ కో-ఫౌండర్ మయాంక్ బిడవాక్తా చెప్పారు. కొంత మంది తమ టీంలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ‘ట్విట్టర్ సంస్థలో #రిప్ ట్విట్టర్ క్యాంపెయిన్ చూడాలంటేనే చాలా బాధగా ఉంది. ఇది త్వరితగతిన ముగిసిపోవాలని కోరుకుంటున్నాం. ట్విట్టర్ మాజీ ఉద్యోగుల్లో కొందరిని నియమించుకుంటాం. తదుపరి దశకు ‘కూ’ను విస్తరించాలని నిర్ణయించాం. ట్విట్టర్ మాజీ ఉద్యోగులు తమ ప్రతిభా పాటవాలకు విలువ ఉన్న చోట పని చేయాలని భావిస్తున్నారు. మైక్రో బ్లాగింగ్ ప్లాట్ ఫామ్ పీపుల్స్ పవర్. అణచివేత కాదు’ అని బిడావక్తా ట్వీట్ చేశారు.
త్వరలో అమెరికాలో సేవలు ప్రారంభించాలని ట్విట్టర్ రైవల్ ‘కూ’కో-ఫౌండర్ అప్రమేయ రాధాక్రుష్ణ చెప్పారు.. ట్విట్టర్ సంస్థను ఎలన్ మస్క్ టేకోవర్ చేశాక దాని యూజర్లు తగ్గిపోతున్నారని వార్తలొస్తున్న నేపథ్యంలో అమెరికాలో సేవలు ప్రారంభించాలని ‘కూ’ నిర్ణయించడం గమనార్హం.
పూర్తిగా స్వదేశీ యాప్గా నిలిచిన కూ.. ఇప్పటివరకు 50 మిలియన్ల డౌన్ లోడ్లు నమోదు చేసుకుంది. తద్వారా ప్రపంచంలోనే అత్యధిక మంది వినియోగించే రెండో మైక్రో బ్లాగింగ్ యాప్గా అవతరించింది. ఇండియాతోపాటు పలు దేశాల్లో కూ యాప్ పదికి పైగా భాషల్లో సేవలు అందిస్తున్నది. త్వరలో అమెరికాలోనూ సేవలు ప్రారంభించనున్నది.
ట్విట్టర్ మాదిరిగా తాము ఎటువంటి వెరిఫికేషన్ ఫీజు వసూలు చేయబోమని కూ యాప్ యాజమాన్యం ప్రకటించింది. ఎలన్ మస్క్ ఈ నెల 29 నుంచి తిరిగి 8 డాలర్లకు బ్లూ టిక్ వెరిఫికేషన్ ఫీజును ప్రారంభించనున్నారు. మస్క్ తీసుకుంటున్న నిర్ణయాలతో విభేదిస్తున్న సీనియర్ ఎగ్జిక్యూటివ్లు ట్విట్టర్ను వీడారు. కొన్ని ప్రముఖ సంస్థలు ట్విట్టర్లో యాడ్స్ నిలిపేసిన సంగతి తెలిసిందే.