న్యూఢిల్లీ : ఈకామర్స్ దిగ్గజం అమెజాన్లో అసలేం జరుగుతోంది. ఎడాపెడా కొలువుల కోతకు ఎందుకు తెగబడుతోందనే చర్చకు తెరలేచింది. అమెజాన్లో లేఆఫ్స్ కలకలంతో ఉద్యోగుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఏరోజు తమ కొలువుకు కోత పడుతుందో అని వణికిపోతున్నారు. అమెజాన్ మరోసారి లేఆఫ్స్ బాంబు పేల్చడంతో ఎప్పుడేం జరుగుతుందోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఆర్ధిక మాంద్యం భయాలు వెంటాడటం, ఆదాయం గణనీయంగా పడిపోవడంతో వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగానే లేఆఫ్స్ తప్పడం లేదని కంపెనీ చెబుతోంది.
ఇక అమెజాన్లో లేఆఫ్స్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఇటీవల 10,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ప్రకటించిన ఈ-కామర్స్ దిగ్గజం తాజాగా 20,000 మంది ఉద్యోగులపై వేటు వేసేందుకు సన్నద్ధమవుతోంది. పలు ప్రాంతాలకు చెందిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఉద్యోగులు, టెక్నాలజీ స్టాఫ్, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్లను కంపెనీ తొలగించనుంది. రాబోయే కొద్దినెలల్లో మరోసారి మాస్ లేఆఫ్స్ ఉంటాయని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ కంప్యూటర్ వరల్డ్ వెల్లడించింది.
పలు విభాగాల్లో ఉద్యోగుల లేఆఫ్స్పై అమెజాన్ సీఈఓ ఆండీ జస్సీ ఇటీవల విస్పష్ట సంకేతాలు పంపిన నేపధ్యంలో ఈకామర్స్ దిగ్గజంలో ఉద్యోగుల తొలగింపు వార్తలు మళ్లీ ఊపందుకున్నాయి. మాస్ లేఆఫ్స్కు అనుగుణంగా ఉద్యోగుల సామర్ధ్యాన్ని అంచనా వేయాలని కంపెనీ ఇటీవల మేనేజర్స్కు వెల్లడించినట్టు సమాచారం. తొలగించే ఉద్యోగులకు 24 గంటల ముందు నోటీసు జారీ చేయడంతో పరిహార ప్యాకేజ్ను సెటిల్ చేస్తారని తెలిసింది. అమెజాన్లో మరోసారి కొలువుల కోతతో కంపెనీ ఉద్యోగుల్లో గుబులు రేగుతోంది. కంపెనీ ఆదాయం పడిపోతుండటంతో వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.