న్యూఢిల్లీ, మార్చి 14: మరో విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ కూడా తన విమాన టికెట్లపై ఫ్యూయల్ సర్చార్జీని విధిస్తున్నట్టు ప్రకటించింది. ఈ నెల 15 నుంచి అందుబాటులోకి రానున్న ఈ ఫ్యూయల్ సర్చార్జీ దేశీయ విమాన టికెట్లపై రూ.199, అంతర్జాతీయ రూట్లపై రూ.1,300 వసూలు చేస్తున్నట్టు ఒక ప్రకటనలో వెల్లడించింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా విమాన ఇంధన ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోవడంతో ఒక్కో విమానయాన సంస్థలు ఫ్యూయల్ సర్చార్జీని వసూలు చేస్తున్నాయి.
ఇప్పటికే ఇండిగో, ఎయిర్ ఇండియా, ఎయిర్ఎక్స్ప్రెస్లు ఇంధన సర్చార్జీని విధించిన విషయం తెలిసిందే. దీంట్లో భాగంగా ఆకాశ ఎయిర్ కూడా విమాన ప్రయాణం బట్టి ఫ్యూయల్ సర్చార్జీ వసూలు చేస్తున్నట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. పశ్చిమాసియాలో రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో గడిచిన పదిహేను రోజుల్లో ఫ్యూయల్ జెట్ ఏకంగా 40 శాతం వరకు ఎగబాకిందని, దీంతో సంస్థలపై పడుతున్న భారాన్ని తగ్గించుకోవడంలో భాగంగా ఈ సర్చార్జీని విధిస్తున్నట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.