Wings India | హైదరాబాద్, జనవరి 18 (బిజినెస్ బ్యూరో): దేశీయ విమానయాన సంస్థలు విస్తరణ బాట పట్టాయి. పెద్ద ఎత్తున కొత్త విమానాలకు ఆర్డర్లిస్తున్నాయి. దీంతో అటు బోయింగ్, ఇటు ఎయిర్బస్లకు గిరాకీ ఒక్కసారిగా పెరిగిపోయింది. కేవలం నెలల వ్యవధిలోనే ఏకంగా 1,120 ఆర్డర్లు అందుకున్నాయి మరి. ఆకాశ ఎయిర్ మొదలై రెండేండ్లు కూడా కాలేదు.. అప్పుడే మరో 150 కొత్త విమానాలు కావాలంటూ బోయింగ్తో ఒప్పందం చేసుకున్నది.
హైదరాబాద్లో జరుగుతున్న వింగ్స్ ఇండియా 2024 సందర్భంగా ఆకాశ ఎయిర్ ఈ మేరకు ప్రకటించింది. 737 మ్యాక్స్ 10, 737 మ్యాక్స్ 8-200 జెట్స్కు ఆర్డర్ ఇచ్చినట్టు వివరించింది. ఇప్పటికే 2021లో 72 బోయింగ్ 737 మ్యాక్స్ ఎయిర్క్రాఫ్ట్ల కోసం, 2023 జూన్లో 4 బోయింగ్ 737 మ్యాక్స్ 8 ఎయిర్క్రాఫ్ట్ల కోసం ఆకాశ ఎయిర్ ఆర్డర్లు ఇచ్చింది.
దీంతో మొత్తం ఆర్డర్లు 226కు చేరుకున్నట్టు సంస్థ వ్యవస్థాపక సీఈవో వినయ్ దూబే గురువారం తెలిపారు.
ఇందులో 22 విమానాలను అందుకున్నామన్న ఆయన.. వచ్చే ఎనిమిదేండ్లలో మిగతా 204 విమానాలను పొందనున్నట్టు చెప్పారు. ఇక ఒకేసారి 150 విమానాల ఆర్డర్ ఇవ్వడంతో ఇప్పటిదాకా ప్రపంచ విమానయాన రంగంలో నమోదైన భారీ ఆర్డర్లలో తమది కూడా ఒకటైనట్టు దూబే పేర్కొన్నారు. కాగా, 2022 ఆగస్టు 7న ఆకాశ ఎయిర్ విమానయాన సేవలు మొదలైన విషయం తెలిసిందే.
గత ఏడాది 970 విమానాల ఆర్డర్లు
ఎయిర్ ఇండియా, ఇండిగో సంస్థలు గత ఏడాది 970 విమానాల కోసం బోయింగ్కు, ఎయిర్బస్కు ఆర్డర్లిచ్చిన సంగతి విదితమే. కేంద్ర ప్రభుత్వం నుంచి టాటాలు సొంతం చేసుకున్న ఎయిర్ ఇండియా.. 470 కొత్త విమానాల ఆర్డర్లిచ్చింది. ఎయిర్బస్కు 250, బోయింగ్కు 220 విమానాలు కావాలంటూ నిరుడు ఫిబ్రవరిలో చెప్పింది. అలాగే గత ఏడాది జూన్లో భారతీయ విమానయాన దిగ్గజం ఇండిగో సైతం ఎయిర్బస్కు 500 నారో-బాడీ ప్లేన్ల తయారీకి ఆర్డర్ ఇచ్చింది.
ఈ క్రమంలో ఇప్పుడు ఆకాశ ఎయిర్ 150 ప్లేన్ల ఆర్డర్.. మొత్తం 11 నెలల్లో భారతీయ విమానయాన సంస్థల నుంచి వెళ్లిన ఆర్డర్లను 1,120కి చేర్చింది. కాగా, ఇండిగోకు కొత్తగా అందాల్సిన విమానాల సంఖ్యే దాదాపు వెయ్యిగా ఉండటం గమనార్హం. ఇక నిరుడు మే నెల నుంచి విమానయాన సేవలకు దూరమైన గో ఫస్ట్ సంస్థ సైతం గతంలో 72 విమానాలకు ఆర్డర్ ఇచ్చింది. ఏదేమైనా వచ్చే కొన్నేండ్లలో దేశీయ విమానయాన సంస్థల్లోకి 1,600లకుపైగా కొత్త ఎయిర్క్రాఫ్ట్లు రానున్నాయి. ప్రస్తుతం దేశంలోని విమానయాన సంస్థలన్నింటికి కలిపి 730 ఎయిర్క్రాఫ్ట్లున్నాయి. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న పౌర విమానయాన మార్కెట్లలో భారత్ కూడా ఒకటన్నది విదితమే.
పైలెట్ శిక్షణ కేంద్రం..
టాటా గ్రూపునకు చెందిన ఎయిర్ ఇండియాతో కలిసి గురుగ్రామ్లో పైలెట్ల శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు ఎయిర్బస్ ప్రకటించింది. జాయింట్ వెంచర్లో ఏర్పాటు కానున్న ఈశిక్షణ కేంద్రంలో ఇరు సంస్థలకు సగం వాటా ఉండనున్నది. ఇప్పటికే జీఎమ్మార్ ఏరో టెక్నిక్తో కలిసి విమానాల నిర్వహణ, ఇంజినీరింగ్ శిక్షణ కేంద్రాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 3,300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న ఈ సెంటర్లో 10 ఫుల్ ఫ్లైట్ సిమ్యులేటర్స్(ఎఫ్ఎఫ్ఎస్), ఫ్లైట్ శిక్షణ క్లాస్రూం నెలకొల్పబోతున్నది. వచ్చే ఏడాది తొలి నెలలోనే ఈ శిక్షణ కేంద్రం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నది. వచ్చే పదేండ్లలో కొత్తగా 5 వేల మంది పైలెట్లు అవసరం ఉంటుంది.