Akasa Air | భారత్కు చెందిన విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్లైన్స్ భారీగా విమానాలను కొనుగోలు చేసేందుకు ఆర్డర్ ఇచ్చింది. ఎయిర్ 150 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల కోసం ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్లో జరిగిన వింగ్స్ ఇండియా ఈవెంట్లో మరోసారి విమానాల కోసం ఒప్పందం కుదుర్చుకున్నది. దివంగత రాకేష్ ఝున్జున్వాలా కుటుంబానికి చెందిన కంపెనీ గతంలో 76 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలకు ఆర్డర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో 22 విమానాలను కంపెనీ డెలివరీ చేసింది. భారత విమానయాన రంగంలోకి ఆకాశ ఎయిర్లైన్స్ కొత్తగా ప్రవేశించిన విషయం తెలిసిందే.
2022లో విమానయానరంగంలోకి ప్రవేశించిన ఆకాశ ఎయిర్లైన్స్ ఇప్పటి వరకు 4శాతం మార్కెట్ వాటాను సాధించింది. అయితే, ఇండిగో 60శాతం మార్కెట్ వాటా కలిగి ఉండగా.. టాటాగ్రూప్ ఎయిర్లైన్స్కు 26శాతం వాటా ఉన్నది. మరో వైపు ఆకాశ ఎయిర్లైన్స్ అంతర్జాతీయ కార్యకలాపాలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఇందుకు సంబంధించిన అర్హతను ఎయిర్లైన్స్ సాధించింది. ఈ ఏడాది దోహా, రియాద్కి విమానాలను ప్రారంభించాలని యోచిస్తున్నది. భారతీయ నిబంధనల ప్రకారం.. అంతర్జాతీయంగా విమానాలు నడపాలంటే.. తన ఫ్లీట్లో కనీసం 20 విమానాలను ఉండాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా.. గత ఏడాది మరో ఎయిర్లైన్స్లో చేరేందుకు ఎలాంటి నోటీసు లేకుండా 40 మందికిపైగా పైలట్లు రాజీనామా చేయడంలో విమానయాన సంస్థ ఇబ్బందులను ఎదుర్కొన్నది.
ఒక్కసారిగా పైలట్లు రాజీనామా చేయడంతో కొత్తగా ప్రారంభించిన ఆకాశ ఎయిర్లైన్స్ సంక్షోభంలోకి వెళ్లింది. ఒక దశలో విమాన సంస్థ మూతపడొచ్చనే వార్తలు వచ్చాయి. పైలట్ల ఆకస్మిక రాజీనామా వల్ల సెప్టెంబర్లో ప్రతి రోజు దాదాపు 24 విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత పరిస్థితుల్లో దీంతో విమానయాన సంస్థ విమానాల సంఖ్యను తగ్గించుకోవాల్సి వచ్చింది. దాంతో మార్కెట్ వాటా ఒకశాతం వరకు క్షీణించింది. ఆ తర్వాత కంపెనీ కొత్తగా పైలట్లను నియమించుకున్నది. సీఈవో వినయ్ కొత్తగా పైలట్లను నియమించుకున్నామని.. బలమైన బెంచ్ స్ట్రెంత్ని సృష్టించామని వెల్లడించారు.