Airtel Broadband | టెలికం రంగంలో ప్రధాన సంస్థలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ మధ్య పోటీ మరింత తీవ్రం అయ్యిందా.. చౌక ధరల టారిఫ్లతో యూజర్లను ఆకట్టుకునేందుకు ముందుకు వస్తున్నాయా.. అంటే అవుననే సమాధానమే వస్తుంది. భారతీ ఎయిర్టెల్ తాజాగా చౌక ధరలోనే రెండు కొత్త బ్రాడ్ బాండ్ ప్లాన్లు అందుబాటులోకి తెచ్చింది. బ్రాడ్బాండ్ స్టాండ్బై ప్లాన్లు అనే పేరుతో వీటిని ప్రకటించింది. వాటిల్లో ఒక ప్లాన్ టారిఫ్ రూ.199 కాగా, మరో ప్లాన్ టారిఫ్ రూ.399గా ఎయిర్ టెల్ ఖరారు చేసింది. గత నెలలో బ్యాకప్ ప్లాన్ పేరుతో రిలయన్స్ జియో రూ.198లకే జియో బ్రాడ్ బాండ్ ప్లాన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో జియోకు పోటీగానే ఎయిర్టెల్ ఈ టారిఫ్ ప్లాన్లు తెచ్చినట్లు కనిపిస్తున్నది.
ఎయిర్టెల్ ప్రకటించిన కొత్త బ్రాడ్బాండ్ ప్లాన్లతో 10 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ సేవలు అందుకోవచ్చు. అయితే రూ.199 టారిఫ్ ఎంచుకున్న యూజర్లు ఒకేసారి ఐదు నెలల చార్జీ పే చేయాలి. ఇన్స్టలేషన్ చార్జీ రూ.500తోపాటు మొత్తం రూ.1674 పే చేయాలి. ఈ ప్లాన్లో వై-ఫై రౌటర్ ఉచితంగా అందిస్తుంది ఎయిర్టెల్.
ఇక మరో రూ.399 టారిఫ్ ఎంచుకున్న వారికి కూడా 10 ఎంబీపీఎస్ స్పీడ్తో ఇంటర్నెట్ సేవలు పొందొచ్చు. ఈ టారిఫ్ ఎంచుకున్న కస్టమర్లకు కూడా ఎయిర్ టెల్ ఉచితంగా రౌటర్ అందిస్తుంది. ఈ టారిఫ్ కింద అదనంగా ఎక్స్ ట్రీమ్ బాక్స్, 350 చానెల్స్ ఫ్రీగా లభిస్తాయి. రూ.500 ఇన్స్టలేషన్ చార్జీతోపాటు మొత్తం ఐదు నెలల టారిఫ్ కలుపుకుని రూ.3000 ఒకేసారి పే చేయాలి. ఈ రెండు ప్లాన్లతోపాటు ఎయిర్టెల్ రూ.499, రూ.799, రూ.999, రూ.3999 టారిఫ్లతో వేర్వేరు బ్రాడ్ బాండ్ ప్లాన్లు అందిస్తున్నది.
గత నెలలో రిలయన్స్ జియో తన బ్రాడ్ బాండ్ యూజర్ల కోసం రూ.198లకే బ్యాకప్ ప్లాన్ అమల్లోకి తెచ్చింది. ఈ ప్లాన్ ఎంచుకున్న యూజర్లు కూడా 10 ఎంబీపీఎస్ స్పీడ్తో ఇంటర్నెట్ సేవలు అందుకోవచ్చు. ఈ ప్లాన్ ఎంచుకున్న కస్టమర్లు అదనంగా రూ.21-152 పే చేసి ఒక రోజు నుంచి ఏడు రోజుల వరకు తమ ఇంటర్నెట్ స్పీడ్ 30 ఎంబీపీఎస్ నుంచి 100 ఎంబీపీఎస్ వరకు పెంచుకునే వెసులుబాటు కల్పించింది. అయితే, ఐదు నెలల టారిఫ్ ఒకేసారి పే చేయాలి. ఈ ప్లాన్ అప్గ్రేడ్ చేసుకున్న వారు టీవీ, ఓటీటీ సబ్స్క్రిప్షన్ కూడా పొందవచ్చు.