హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్ 27 (నమస్తే తెలంగాణ): రోజు రోజుకు హైదరాబాద్ విమానాశ్రయం గుండా ప్రయాణించేవారి సంఖ్య భారీగా పెరుగుతున్నది. గత నెలలో ఏకంగా 17.50 లక్షల మంది ఈ విమానాశ్రయం గుండా తమ గమ్యస్థానాలకు చేరుకున్నట్లు ఎయిర్పోర్ట్ను నిర్వహిస్తున్న జీఎమ్మార్ ఒక ప్రకటనలలో వెల్లడించింది. కరోనా ప్రభావం తగ్గడంతో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి.
దేశంలోని ఇతర విమానాశ్రయాల కంటే వేగంగా రికవరీ రేటు ఉన్నదని, గత నెలలో 17.50 లక్షల మంది ప్రయాణికుల్లో దేశీయంగా 15 లక్షల మంది ప్రయాణించగా, అంతర్జాతీయ రూట్లలో 2.70 లక్షల మంది ప్రయాణించినట్లు వెల్లడించింది. ‘కొవిడ్ తీవ్రత తగ్గి, ప్రయాణికుల డిమాండ్ పెరగడంతో గత నెలలో ప్రయాణికుల సంఖ్య పెరిగింది. దేశంలోని ఇతర విమానాశ్రయాల కంటే హైదరాబాద్ విమానాశ్రయం నుంచి అత్యధిక రికవరీ రేటు ఉంది. ఇదే కొనసాగితే మేం త్వరలో కొవిడ్ ముందస్తు సంఖ్యకు చేరుకుంటాం’ అని జీఎంఆర్ అంతర్జాతీయ విమానాశ్రయం సీఈవో ప్రదీప్ ఫణికర్ ఆశాభావం వ్యక్తం చేశారు.