న్యూఢిల్లీ, మార్చి 11: దేశీయ విమానయాన సంస్థల నష్టాలు క్రమంగా తగ్గుతున్నాయి. ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండటం, విమాన ఇంధన ధరలు తగ్గుముఖం పట్టడంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో విమానయాన సంస్థల నష్టాలు రూ.3-4 వేల కోట్లకు తగ్గొచ్చని దేశీయ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనావేస్తున్నది. విమానాలు వాడే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుండటం, టికెట్ ధరల్లో పెద్దగా మార్పులు చోటుచేసుకోకపోవడం ఇందుకు కారణమని విశ్లేషించింది. ఫిబ్రవరి నెలలో దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 127.5 లక్షలకు చేరుకునే అవకాశం ఉన్నదని పేర్కొంది.
కాగా, ప్రాట్ అండ్ విట్నీ(పీఅండ్డబ్ల్యూ)కి చెందిన విమాన ఇంజిన్లలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో దేశీయ విమానయాన సంస్థలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. ముఖ్యంగా పలు విమానయాన సంస్థలు భారీ స్థాయిలో తమ సర్వీసులను రద్దు చేసుకుంటున్నాయి. దీంతో విమానాల సరఫరాలో సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా దేశీయ విమాయాన దిగ్గజం సంస్థ ఇండిగో ఏకంగా 70 విమాన సర్వీసులను నేలపట్టునే నిలిచిపోయాయి. ప్రస్తుత నెలలోనూ ఇదే తీరు కొనసాగనున్నదని తెలిపింది.