హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ నుంచి సింగపూర్కు రాకపోకలు సాగించే ప్రయాణిలకు కోసం సింగపూర్ ఎయిర్లైన్స్ సరికొత్తగా ఏ 350 -900 అతిపెద్ద విమాన సర్వీసును అందుబాటులోకి తీసుకురానున్నది. ఈ నెల 30వ నుంచి ఈ విమాన సేవలు ఆరంభంకానున్నాయి. ఎస్క్యూ 523 నంబర్ గల విమానం ఈ నెల 30న రాత్రి 11:10 గంటలకు హైదరాబాద్ నుంచి సింగపూర్కు బయలుదేరుతుంది అతిపెద్ద బాడీ గల ఈ ఎయిర్క్రాఫ్ట్లో 303 సీట్లు ఉండనున్నాయి. వీటలో ఎకానమీ క్లాస్లో 263, బిజినెస్ క్లాస్ 40 సీట్లుంటాయి. ఇది 15 వేల కిలోల సరుకును మోసుకెళ్లగలదు. ప్రస్తుతానికి సింగపూర్ – హైదరాబాద్ల మధ్య బోయింగ్ 737 – 8 విమానాలను సంస్థ నడుపుతున్నది. ఈ విమానం సీట్ల సామర్థ్యం ఎకానమీలో 144, బిజినెస్క్లాస్లో 10 సీట్లతో మొత్తంగా 154 సీట్లు మాత్రమే. ఇది కేవలం 2,400 కిలోల సరుకును మాత్రమే మోసుకెళ్లగలదు. కొత్తగా ప్రారంభించే ఏ 350 -900 విమానం వారంలో గురు, శుక్ర, శని, ఆదివారాల్లో ప్రయాణికులకు సేవలందించనున్నది. ఈ సందర్భంగా సింగపూర్ ఎయిర్లైన్స్ జనరల్ మేనేజర్ సై యెన్ చెన్ మాట్లాడుతూ.. ఏ 350 ఎయిర్క్రాఫ్ట్ సేవలను హైదరాబాద్ నుంచి ప్రారంభించడం పట్ల సంతోషిస్తున్నామన్నారు.