న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: ఏ220 విమానాల డోర్లు భారత్లోనే తయారవనున్నాయి. ఈ మేరకు దేశీయ సంస్థ డైనమెటిక్ టెక్నాలజీస్తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఐరోపాకు చెందిన విమానాల తయారీ దిగ్గజం ఎయిర్బస్ గురువారం ప్రకటించింది. కాగా, ఓ భారతీయ విమానయాన రంగ తయారీ సంస్థకు దక్కిన అతిపెద్ద ఎగుమతి కాంట్రాక్టుల్లో ఇది కూడా ఒకటని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా అన్నారు. విమానాల విడిభాగాల తయారీలో భారత్ కీలకం అవుతున్నదన్న ఆనందాన్నీ కనబర్చారు.
రాబోయే కొన్నేండ్లలో భారత్ నుంచి అందుకునే సేవలు, విడిభాగాల విలువను 1.5 బిలియన్ డాలర్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న ఎయిర్బస్కు ఈ కాంట్రాక్టు కలిసిరాగలదన్న ఆశాభావాన్నీ వ్యక్తం చేశారు. ప్రస్తుతం 750 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇక ఈ కాంట్రాక్టులో భాగంగా ఎయిర్బస్ 220 కార్గో, ప్యాసింజర్ విమానాల డోర్ల తయారీ, సర్వీసింగ్ను డైనమెటిక్ టెక్నాలజీస్ అందించనున్నది. ఒక్కో విమానానికి 8 డోర్లుంటాయి. ఈ డోర్లతోపాటు వాటికి సంబంధించిన అన్ని విడిభాగాలనూ సంస్థ తయారు చేయనున్నది. ఇదిలావుంటే ఇప్పటికే ఎయిర్బస్కు చెందిన ఏ330, ఏ320 విమానాల ఫ్లాప్ ట్రాక్ బీమ్లనూ బెంగళూరుకు చెందిన డైనమెటిక్ టెక్నాలజీస్ సంస్థే తయారు చేస్తుండటం విశేషం. అలాగే ఏ220 విమానాల్లో కాక్పీట్ ఎస్కేప్ హ్యాచ్ డోర్లనూ ఉత్పత్తి చేస్తున్నది.