Air India | ఎయిర్ ఇండియా సిబ్బందికి దాని మాతృ సంస్థ టాటా సన్స్ గట్టి హెచ్చరికలు జారీ చేసింది. విధి నిర్వహణ సమయంలో నైతిక విలువల పట్ల జాగ్రత్త వహించాలని స్పష్టం చేసింది. టాటా గ్రూప్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే.. అది తమ సంస్థ ప్రతిష్ఠను దెబ్బ తీయడమేనని పేర్కొంది. అటువంటి వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది.
ఇటీవల ఢిల్లీ విమానాశ్రయంలో సెక్యూరిటీ చెక్ వద్ద పైలట్ వద్ద రెండు ఐ-ఫోన్-14 ఫోన్లను భద్రత అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత పైలట్ వద్ద ఐ-ఫోన్ 14 ఉన్నందుకు ఆయన నుంచి రూ.2.5 లక్షల కస్టమ్స్ డ్యూటీ వసూలు చేశారు. దీనిపై ఎయిర్ ఇండియా ఎటువంటి ప్రకటన జారీ చేయలేదు. అయితే ఈ సంఘటన నేపథ్యంలో క్రూ సిబ్బందికి `మహారాజా` ప్రవర్తనా నియమావళి జారీ చేసినట్లు తెలుస్తున్నది.
భారత్ నుంచి విదేశాలకు వెళ్లే విమాన సిబ్బంది.. తిరుగు ప్రయాణంలో భారీ మొత్తంలో వస్తువులు కొనుగోలు చేస్తున్నారని మాకు సమాచారం అందిందని ఎయిర్ ఇండియా తెలిపింది. ఇది కస్టమ్స్ నిబంధనలకు వ్యతిరేకం అని స్పష్టం చేసింది. తమ విమాన సిబ్బంది.. ఎయిర్ ఇండియాకు ప్రచారకర్తలని గుర్తు చేసింది. వారు నైతిక ప్రమాణాలు, విలువలకు కట్టుబడి పని చేయాల్సి ఉంటుందని తెలిపింది. గతేడాది మేలో ఎయిర్ ఇండియా తమ సిబ్బందికి టాటా సన్స్ ఉద్యోగుల ప్రవర్తనా నియమావళిని అమల్లోకి తెచ్చింది.