Air India | మహారాజా`గా పేరొందిన ఎయిర్ ఇండియాకు పూర్వ వైభవం తేవాలని తలపోసింది దాని పేరెంట్ సంస్థ టాటా సన్స్. అందుకోసం ఎయిర్బస్, బోయింగ్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల నుంచి దాదాపు 500 విమానాల కొనుగోలు ఆర్డర్ పెట్టాలని భావించింది. భారీగా విమానాల కొనుగోలుకు ఆర్డర్ పెట్టిన ఎయిర్ ఇండియాకు భారీ డిస్కౌంట్లు ఇవ్వడానికి 737 మ్యాక్స్ విమానాల ఇంజిన్ తయారీ సంస్థలు విముఖత వ్యక్తం చేస్తున్నాయి. దీంతో ఎయిర్బస్, బోయింగ్ విమానాలను కొనుగోలు చేయాలన్న ఎయిర్ ఇండియా డీల్పై ప్రతిష్ఠంభన ఏర్పడింది.
ఇంజిన్ల మెయింటెన్స్, రిపేర్లపై భారీ డిస్కౌంట్లు ఇవ్వడానికి ఈ విమానాల్లోని ఇంజిన్లను తయారు చేస్తున్న సీఎఫ్ఎం ఇంటర్నేషనల్, జనరల్ ఎలక్ట్రిక్ కో, సాఫ్రాన్ ఎస్ఏ జాయింట్ వెంచర్ ససేమిరా అంటున్నట్లు సమాచారం. ఇంజిన్ల రిపేర్లకు గంటల ప్రాతిపదికన ధర చెల్లించడానికి ఎయిర్ ఇండియా సిద్ధమైనట్లు తెలుస్తున్నది. కానీ మహారాజా ప్రతిపాదనకు సీఎఫ్ఎం ఇంటర్నేషనల్ తదితర సంస్థలతో కూడిన జాయింట్ వెంచర్ నిరాకరిస్తున్నదని ఈ చర్చలతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు.
దేశీయంగా, అంతర్జాతీయంగా సంస్థ సర్వీసులు బలోపేతం చేయడానికి 400 నారోబాడీ, 100 వైడ్బాడీ విమానాల కొనుగోలు చేయాలని ఎయిర్ ఇండియా తలపెట్టింది. ఇందుకోసం కొన్ని నెలలుగా ఎయిర్బస్, బోయింగ్ సంస్థల యాజమాన్యాలతో సంప్రదింపులు జరిపింది. తాజా ప్రతిష్ఠంభన నేపథ్యంలో విమానాల తయారీదారులు, ఇంజిన్ల తయారీ సంస్థలు, లీజింగ్ కంపెనీల మధ్య సంప్రదింపులు ఈ ఏడాది చివరికి ముగింపునకు వస్తాయని భావిస్తున్నారు. దీనిపై స్పందించేందుకు సీఎఫ్ఎం ఇంటర్నేషనల్ ప్రతినిధి నిరాకరించారు. ఎయిర్బస్, బోయింగ్ సంస్థలతో సంప్రదింపులు పూర్తిగా రహస్యం అని ఆ ప్రతినిధి తేల్చేశారు.