Air India-AirBus | ప్రముఖ విమానాల తయారీ సంస్థ ఎయిర్బస్ నుంచి 250 విమానాలను కొనుగోలు చేయడానికి టాటా సన్స్ ఆధీనంలోని ఎయిర్ ఇండియా (ఏఐ) చారిత్రక ఒప్పందం చేసుకుంది. ఒప్పందంపై ఎయిర్ ఇండియా ప్రతినిధులు సంతకాలు చేశారని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ మంగళవారం ప్రకటించారు. కొత్త రూట్లలో విమాన సర్వీసులను నిర్వహించడం ద్వారా సేవలను విస్తరించాలని తలపెట్టింది మహారాజా. అందుకోసం కొత్త విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఎయిర్ బస్ నుంచి 40 వైడ్ బాడీ ఏ350 విమానాలు, 210 నారోబాడీ విమానాలను ఎయిర్ ఇండియా కొనుగోలు చేయనున్నది. ఆల్ట్రా లాంగ్ ఫ్లయిట్ జర్నీ కోసం వైడ్బాడీ విమాన సర్వీసులు ఉపయోగిస్తారు.
`మేం ఎయిర్బస్తో చాలా మంచి సంబంధాలను నెలకొల్పుకుంటున్నాం. ఎయిర్బస్ నుంచి 250 విమానాలను కొనుగోలు చేసేందుకు లెటర్ ఆఫ్ ఇంటెంట్పై మేం సంతకం చేశాం అని ప్రకటించడానికి ఈ రోజు నేను సంతోషంగా ఉన్నాను` అని చంద్రశేఖరన్ తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యూ ఎయిర్ ఇండియా-ఎయిర్బస్ పార్టనర్షిప్ ప్రారంభమైంది. ఎయిర్ ఇండియా పునర్వైభవానికి ఎయిర్బస్ సాయ పడటం చారిత్రక సందర్భం అని ఎయిర్బస్ సీఈవో గౌల్లామే ఫౌరీ వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్, కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ఎయిర్బస్ సీఈవో గౌల్లామె ఫర్రీ పాల్గొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎయిర్ ఇండియా భారీగా విమానాలను కొనుగోలు చేయనున్నదని వార్తలు వచ్చాయి. బోయింగ్తోపాటు ఎయిర్బస్ వద్ద దాదాపు 500 విమానాల కొనుగోలుకు ఆ రెండు సంస్థలతో ఒప్పందాలపై ఎయిర్ ఇండియా సంతకాలు చేయనున్నదని గతవారం రాయిటర్స్ ఓ వార్తా కథనం ప్రచురించింది. ఈ విమానాల కొనుగోలు ఒప్పందంపై ఈ నెల 10 ఎయిర్ ఇండియా, ఎయిర్బస్ సంతకాలు చేశాయి.
ఎయిర్బస్, బోయింగ్ సంస్థల నుంచి 500 విమానాలను కొనుగోలు చేయనున్నట్లు గతేడాది డిసెంబర్ 11న వార్తలొచ్చాయి. వీటిల్లో ఎయిర్బస్ ఏ350, బోయింగ్ 787 & 777 విమానాలు కూడా ఉన్నాయని సమాచారం. ఈ విమానాల కొనుగోలు ద్వారా మహారాజాకు పూర్వ వైభవం తేవాలని టాటా సన్స్ ఉవ్విళ్లూరుతున్నట్లు వినికిడి. 400 నారో వైడ్, 100 అంత కంటే మోర్ వైడ్ విమానాల కోసం ఆర్డర్ పెట్టనున్నట్లు తెలుస్తున్నది. 2023లో ఈ విమానాల కొనుగోలు కోసం బోయింగ్, ఎయిర్ బస్ సంస్థలతో ఎయిరిండియా ఒప్పందాలపై సంతకాలు చేయనున్నదని గతేడాదే వార్తలొచ్చాయి.
భారీగా విమానాల కొనుగోలుకు సిద్ధమైన ఎయిర్ ఇండియాకు భారీ డిస్కౌంట్లు ఇవ్వడానికి 737 మ్యాక్స్ విమానాల ఇంజిన్ తయారీ సంస్థలు విముఖత వ్యక్తం చేశాయని గత నెలలో వార్తలొచ్చాయి. ప్రత్యేకించి ఇంజిన్ల మెయింటెన్స్, రిపేర్లపై భారీ డిస్కౌంట్లు ఇవ్వడానికి ఈ విమానాల ఇంజిన్ల తయారీ సంస్థలు సీఎఫ్ఎం ఇంటర్నేషనల్, జనరల్ ఎలక్ట్రిక్ కో, సాఫ్రాన్ ఎస్ఏ జాయింట్ వెంచర్ ససేమిరా అన్నట్లు సమాచారం. ఇంజిన్ల రిపేర్లకు గంటల ప్రాతిపదికన ధర చెల్లించడానికి ఎయిర్ ఇండియా సిద్ధమైనట్లు తెలుస్తున్నది. కానీ మహారాజా ప్రతిపాదనకు సీఎఫ్ఎం ఇంటర్నేషనల్ తదితర సంస్థలతో కూడిన జాయింట్ వెంచర్ నిరాకరించిందని ఈ చర్చలతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు.