Air India | టాటా సన్స్ ఆధీనంలోని ఎయిరిండియా (ఏఐ) గురువారం కీలక నిర్ణయం తీసుకున్నది. రిటైర్మెంట్ అయిన పైలట్లను తిరిగి ఐదేండ్ల పాటు పునః నియమించుకోనున్నట్లు ప్రకటించింది. పునః నియమించుకునే పైలట్లను కమాండర్లుగా అపాయింట్ చేసుకోవాలని భావిస్తున్నది. క్యాబిన్ సిబ్బందితోపాటు మొత్తం ఎయిరిండియా ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) పథకం ప్రకటించినా పైలట్ల పునః నియామకం ప్రకటన చేయడం గమనార్హం. మొత్తం సంస్థలో యువ రక్తానికి చోటు కల్పించాలని ఎయిరిండియా భావిస్తున్నట్లు సమాచారం.
క్యాబిన్ క్రూ, విమానాల నిర్వహణ ఇంజినీర్లతో పోలిస్తే పైలట్లు ఏదైనా విమానయాన సంస్థకు అత్యంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారింది. దేశీయ విమానయాన రంగంలో సరిపడా శిక్షణ పొందిన పైలట్ల కొరత ఎల్లవేళలా సమస్యగానే ఉంది.
పైలట్లతో రిటైర్మెంట్ తర్వాత ఐదేండ్ల పాటు ఎయిరిండియా కమాండర్గా కాంట్రాక్ట్ కుదుర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఆసక్తి గల వారు 65 ఏండ్ల వయస్సు వచ్చే వరకూ కొనసాగిస్తాం.. అయితే ఐదేండ్ల సర్వీసు లేదా.. 65 ఏండ్లలో ఏది ముందైతే అదే అమలవు చేస్తాం అని సిబ్బందికి పంపిన ఇంటర్నల్ మెయిల్లో ఎయిరిండియా డిప్యూటీ పర్సనల్ మేనేజర్ వికాస్ గుప్తా తెలిపారు. ఆసక్తిగల పైలట్లు ఈ నెల 23 లోగా రాతపూర్వకంగా సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు.