Air India | టాటా సన్స్ ఆధీనంలోని ఎయిర్ ఇండియా మంగళవారం సంచలన నిర్ణయం తీసుకున్నది. గతేడాది నవంబర్ చివరి వారంలో అంతర్జాతీయ రూట్లలో విమానాలు ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణికుల అనుచిత వైఖరి నేపథ్యంలో ఇన్-ఫ్లయిట్ ఆల్కాహాల్ సర్వీస్ పాలసీని సవరించాలని నిర్ణయించింది. ఆల్కాహాల్ అడిగిన వారికి అవసరమైతేనే వారికి సరఫరా చేసే విషయంలో క్రూ సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించాలని సూచించింది. అయితే, సవరించిన ఇన్ఫ్లయిట్ ఆల్కాహాల్ సర్వీస్ పాలసీలో మార్పులేమిటన్న సంగతి తెలియరాలేదు.
సవరించిన పాలసీ ప్రకారం క్రూ సిబ్బంది సర్వ్ చేస్తే తప్ప.. విమానంలో ప్రయాణికులు మద్యం సేవించడానికి అనుమతించరని తెలుస్తున్నది. ప్రయాణికులు తమ వెంట సొంతంగా ఆల్కాహాల్ తెచ్చుకుని తాగుతున్నారా? అన్న సంగతిని అనునిత్యం క్రూ సిబ్బంది పరిశీలిస్తూ ఉండాలని స్పష్టం చేసినట్లు సమాచారం. ఆమోదయోగ్యంగా, సురక్షితంగా మాత్రమే ఆల్కాహాల్ సర్వీస్ అమలవుతుంది. తదుపరి దశలో ఆల్కాహాల్ సరఫరా చేసే విషయంలో సమయస్ఫూర్తితో సిబ్బంది నిరాకరించవచ్చునని ఆ విధానం సారాంశం. ఈ విషయంలో అమెరికా నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ మార్గదర్శకాలను తమ విధానంలో చేర్చాలని ఎయిర్ ఇండియా యోచిస్తున్నట్లు సమాచారం.
గత నవంబర్ 26న న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వస్తున్న విమానంలో మహిళా ప్రయాణికురాలిపై శంకర్ మిశ్రా అనే ప్రయాణికుడు మూత్రం పోశాడు. వారం తిరక్క ముందే మరో ఘటన జరిగింది. రెండు సర్వీసుల్లోనూ ప్రయాణికుల అనుచిత వ్యవహార శైలి గురించి సకాలంలో సమాచారం ఇవ్వనందుకు ఎయిర్ ఇండియాపై డీజీసీఏ దాదాపు రూ.40 లక్షల పెనాల్టీ విధించింది. ఒక పైలట్ లైసెన్స్ మూడు నెలల పాటు సస్పెండ్ చేస్తూ ఈ నెల 20న నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.