న్యూఢిల్లీ, డిసెంబర్ 23: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా గుప్పిట్లోకి మరో విమాన సర్వీసు వచ్చి చేరింది. అతిపెద్ద బాడీ కలిగిన ఏ350-900 ఎయిర్క్రాఫ్ట్ శనివారం జతైంది. యూరప్కు చెందిన విమానాల తయారీ దిగ్గజం ఎయిర్బస్ తయారు చేసిన ఈ సర్వీసు ఢిల్లీలోని ఇందీరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మధ్యాహ్నాం దిగినట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఇలాంటి విమాన సర్వీసును నిర్వహిస్తున్న సంస్థ ఎయిర్ ఇండియా కావడం విశేషం. దీంతోపాటు వచ్చే మార్చి లోగా మరో ఐదు విమానాలు కూడా అందుబాటులోకి తీసుకురానున్నది. ఈ ఏడాది మొదట్లో ఎయిర్ ఇండియా.40 ఏ350 ఎస్ విమానాలు, 40 ఏ350-900, ఏ350-1000 ఎయిర్క్రాఫ్ట్లతోపాటు 140 చిన్న సైజు ఏ321, 70 ఏ320 నియో విమానాలకు ఆర్డర్ ఇచ్చిన విషయం తెలిసిందే.
భారతీయ వైమానిక దళం ఆధీనంలో ఉన్న గగనతలాన్ని వినియోగించుకోవడం వల్ల విమానయాన సంస్థలకు ఏటా వెయ్యి కోట్ల రూపాయల వరకు ఆదా కానున్నదని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశీయంగా వినియోగిస్తున్న గగనతలంలో 30 శాతం వైమానిక దళం ఆధీనంలో ఉన్నది. ఈ గగనతలాన్ని వినియోగించుకోవడం వల్ల విమానం నడిచే సమయం తగ్గనున్నదని, అలాగే చమురు వినిమయం, ఉద్గారాలు మరింత తగ్గనున్నాయని తెలిపింది. ఈ నెల 18 నాటికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) 1,562 మంది కమర్షియల్ పైలెట్లకు లైసెన్స్లు జారీ చేసింది. వైమానిక దళం వినియోగిస్తున్న ఏరోస్పేస్లో 40 శాతం వృథాగా ఉన్నదని పేర్కొంది. ఆగస్టు 2020 నుంచి ఇప్పటి వరకు రూ.640.7 కోట్ల ఖర్చులు తగ్గాయని, అలాగే 1.37 లక్షల టన్నుల ఉద్గారాలు తగ్గాయని వెల్లడించింది.