Air India | టాటా సన్స్ ఆధీనంలోని ఎయిర్ ఇండియా.. అమెరికాకు చెందిన విమానాల తయారీ సంస్థ ఎయిర్బస్ నుంచి దాదాపు 250 విమానాల కొనుగోలు చేయడానికి ఒప్పందం ఖరారైనట్లు సమాచారం. వచ్చేవారం రెండు సంస్థల మధ్య ఒప్పందం కుదురుతుందని ఎయిర్ ఇండియా వర్గాలు గురువారం తెలిపాయి. ఈ డీల్కు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కాలేదు. దీనిపై స్పందించేందుకు ఎయిర్ ఇండియా ముందుకు రాలేదు. ఇప్పటికే మరో విమానాల తయారీ సంస్థ బోయింగ్తోనూ సుమారు 200 విమానాల కొనుగోలు ఒప్పందంపై ఇప్పటికే ఎయిర్ ఇండియా సంతకాలు చేసిందని ఆ వర్గాల కథనం. టాటా సన్స్ ఆధీనంలోని ఎయిర్ఇండియా తన విమాన సర్వీసులను విస్తరించాలని భావిస్తున్నది.
ఎయిర్ ఇండియా సీఈవో క్యాంప్బెల్ విల్సన్ గత నెల 27న స్పందిస్తూ నూతన విమానాల కొనుగోలుకు చారిత్రక ఒప్పందం ఖరారైందని ప్రకటించారు. ఇంతకుముందు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నప్పుడు ఎయిర్ ఇండియా కొత్త విమానాలు కొనుగోలు చేసి 16 సంవత్సరాలు దాటింది. 2005 నుంచి కొత్త విమానాలు కొనుగోలు చేయనేలేదు. అప్పట్లో 68 బోయింగ్, 43 ఎయిర్బస్ విమానాలను 10.8 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది.
ఎయిర్బస్ నుంచి ఎయిర్ ఇండియా కొనుగోలు చేసే 250 విమానాల్లో 40 వైడ్ బాడీ ఎయిర్బస్ ఏ350 ఉన్నట్లు తెలుస్తున్నది. గతంలో ఎయిర్ ఇండియా వైడ్-బాడీ ఏ330 విమానాలను నడిపింది. వచ్చే ఏడాదిలోపు భారత ఎయిర్లైన్స్ 1700 విమానాలు కొనుగోలు చేసే అవకాశం ఉందని ఏవియేషన్ కన్సల్టెన్సీ సంస్థ సీఏపీఏ తెలిపింది. అందులో ఎయిర్ ఇండియా తొలుత 500 విమానాలు కొనుగోలు చేస్తుందని సీఏపీఏ వర్గాల కథనం. ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ ఒక్కటే 260కి పైగా వైడ్ బాడీ విమానాలు నడుపుతున్నది. ఇండిగో ఇటీవలే భారత్-టర్కీ మధ్య లీజ్పై బీ777 విమాన సర్వీస్ ప్రారంభించింది.