Air India Express | టాటా సన్స్ ఆధీనంలోని ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ (ఏఐఎక్స్) సిబ్బంది సమ్మె విరమించారు. అనారోగ్య కారణాల పేరిట దాదాపు 300 మంది ఉద్యోగులు రెండు రోజులుగా మూకుమ్మడి సెలవులు పెట్టడాన్ని ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ యాజమాన్యం తీవ్రంగా పరిగణించింది. ఈ విషయమై 25 మంది సిబ్బందిని తొలగిస్తామన్న ఏఐఎక్స్.. మరి కొంత మందికి ఉద్వాసన తప్పదని హెచ్చరికలు జారీ చేయడంతో ఉద్యోగులు తమ ఆందోళన విరమించుకున్నట్లు సమాచారం. దీంతో సిబ్బంది తొలగింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటామని, వారిపై నమోదైన కేసులు సమీక్షిస్తామని ఏఐఎక్స్ అంగీకరించినట్లుగా తెలియవచ్చింది.
యాజమాన్యం తీరుపై అసంతృప్తితో ఉన్న సిబ్బంది సుమారు 300 మంది మూకుమ్మడి సెలవులు పెట్టడంతో ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ (ఏఐఎక్స్) వందల్లో విమాన సర్వీసులు రద్దు చేయడంతో వేల మంది ప్రయాణికులు ఇబ్బందుల పాలయ్యారు. దీంతో సిబ్బంది తీరుపట్ల ఏఐఎక్స్ యాజమాన్యం ఆగ్రహించింది. తొలుత 25 మందిపై వేటు వేయడంతోపాటు గురువారం సాయంత్రంలోపు సిబ్బంది విధుల్లో చేరకుంటే పలువురిని తొలగిస్తామని హెచ్చరికలు జారీ చేసింది.
ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ లో ఏఐఎక్స్ కనెక్ట్ విలీన ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి కొందరు క్యాబిన్ సిబ్బంది అసంతృప్తితో ఉన్నారు. యాజమాన్యం తీరు బాగా లేదని 300 మంది క్యాబిన్ సిబ్బందికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎక్స్ ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ ఆరోపించింది. వేతన ప్యాకేజీల్లో వివక్ష ప్రదర్శిస్తున్నారని వ్యాఖ్యానించింది.