Banana Price | గతంలో ఉల్లిగడ్డల ధరలు పెరిగేవి.. తాజాగా టమాటలు కిలో రూ.200 వరకూ దూసుకెళ్లి.. కిందకు దిగివచ్చాయి. ఇప్పుడు అదే బాటలో అరటి పండ్లు ప్రయాణిస్తున్నాయి. కర్ణాటక రాజధాని బెంగళూరులో కిలో అరటి పండ్లు రూ.100 పలుకుతున్నాయి. డిమాండ్కు తగ్గ సరఫరా లేకపోవడమే దీనికి కారణం అని చెబుతున్నారు. అరటి పండ్ల కోసం బెంగళూరు వాసులకు గణనీయ భాగం తమిళనాడు నుంచి సరఫరా అవుతుంది. బెంగళూరు వాసుల్లో ప్రధానంగా ఎలక్కి బలే, పచ్ బలే అనే రెండు ప్రైమరీ వెరైటీ అరటి కాయలు, పండ్లు వాడుతుంటారు. ప్రస్తుతం తమిళనాడు నుంచి బెంగళూరుకు అరటి దిగుమతి తగ్గింది. నెల రోజుల క్రితం కర్ణాటకలోని బిన్నీపేట్ మార్కెట్ కు ఎలక్కిబలే వెరైటీ అరటి పండ్లు ఒక రోజు 1500 క్వింటాళ్లు వస్తే, ఇప్పుడు 1000 క్వింటాళ్లకే పరిమితమైందని బెంగళూరు వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి రాజన్న తెలిపారు.
బెంగళూరు నుంచి తూమకూరు, రామనగర, చిక్కబల్లపుర, అనెకల్, బెంగళూర్ గ్రామీణ ప్రాంతాలకు అరటిపండ్లు, అరటికాయలు సరఫరా చేస్తారు. తమిళనాడులోని హోసూర్, క్రుష్ణగిరి నుంచి అరటిపండ్లు సరఫరా చేస్తారని రాజన్న చెప్పారు.
అంతర్రాష్ట్ర సరఫరాలో ఇబ్బందుల వల్ల హోల్ సేల్ మార్కెట్లో ఎలక్కిబలే వెరైటీ అరటి కిలో రూ.78, పచ్ బలే వెరైటీ రూ.18-20 పలుకుతున్నాయి. రవాణా, మార్కెటింగ్ ఖర్చులు కలుపుకుంటే రిటైల్ మార్కెట్లో కిలో రూ.100 (ఎలక్కిబలే), రూ.40 (పచ్ బలె) పలుకుతున్నాయి.
ఈ నెలాఖరులో ఓనం, గణేశ్ చతుర్థి, విజయదశమి, దీపావళి పండుగలు వస్తాయి. పండుగల సీజన్లో అరటి పండ్లకు డిమాండ్ పెరుగుతుంది. పరిస్థితులు ఇలాగే ఉంటే పండుగల సీజన్లో అరటి ధరలు మరింత పెరుగుతాయని చెబుతున్నారు బెంగళూరు వాసులు.