ఎట్టకేలకు గతవారం ఎన్ఎస్ఈ నిఫ్టీ కొత్త రికార్డుస్థాయికి చేరినప్పటికీ, బుల్స్ లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో గరిష్ఠస్థాయిల్లో అమ్మకాల ఒత్తిడికి లోనయ్యింది. నిఫ్టీ 18,887 పాయింట్ల రికార్డుస్థాయికి పెరిగిన తర్వాత చివరకు 18,696 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం రిజర్వ్బ్యాంక్ ద్రవ్య విధాన సమీక్షలో వడ్డీ రేట్ల పెంపుపై వెలువడే నిర్ణయం, గుజరాత్ ఎన్నికల ఫలితాలు మార్కెట్లను ప్రభావితం చేస్తాయని విశ్లేషకులు చెప్పారు. సాంకేతికంగా నిఫ్టీ అలసిపోయినట్లు కన్పిస్తున్నదని, మార్కెట్ ఓవర్బాట్లో ఉన్నదని, దీంతో కొద్ది రోజుల కన్సాలిడేషన్ జరగవచ్చని ప్రభుదాస్ లీలాధర్ వైస్ ప్రెసిడెంట్ వైశాలి పరేఖ్ అంచనా వేశారు. సాధారణంగా ప్రతీ ఏడాది డిసెంబర్లో మార్కెట్ కదలికలు బుల్లిష్గా ఉంటాయని సామ్కో సెక్యూరిటీస్ సీఈవో జిమిత్ మోదీ తెలిపారు. అయితే డెయిలీ చార్టుల్లో బేరిష్ ప్యాట్రన్ ఏర్పడినందున, చిన్నపాటి కరెక్షన్ జరగవచ్చన్నారు.
మద్దతు 18,500, నిరోధం 18,900
ఈ వారం నిఫీ18,500 పాయింట్ల వద్ద మద్దతు పొందవచ్చని, ఈ స్థాయిని కోల్పోతే 18,380 వరకూ తగ్గవచ్చని జిమిత్ మోది అంచనా వేశారు. 18,900 స్థాయి నిరోధాన్ని బుల్స్ అధిగమిస్తే 19,000 పాయింట్ల స్థాయిని అందుకోవచ్చన్నారు. 18,890-19,000 పాయింట్ల శ్రేణి నిఫ్టీకి అవరోధం కల్గిస్తుందని అంచనా వేస్తున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్మెంట్స్ రీసెర్చ్ అనలిస్ట్ సంతోష్ మీనా తెలిపారు.18,600-18,550 శ్రేణి వద్ద తక్షణ మద్దతు లభించవచ్చని, ఈ శ్రేణి దిగువన 18,440 పాయింట్ల వరకూ తగ్గవచ్చని వివరించారు. నిర్మల్ బంగ్ సెక్యూరిటీస్ ఈక్విటీ టెక్నికల్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ స్వాతి ఆనంద హోత్కర్ తన అంచనాల్ని వెల్లడిస్తూ 18,800 పాయింట్ల స్థాయికి గట్టిగా నిరోధించవచ్చని, ఈ స్థాయిని దాటితే 19,000-19,120 పాయింట్ల శ్రేణి వరకూ పెరుగుతుందన్నారు. దిగువన 18,600, 18,400 పాయింట్ల వద్ద మద్దతు లభిస్తున్నాయన్నారు.