Home Loans | బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ), పంజాబ్ నేషనల్ బ్యాంకుల్లో ఇండ్ల రుణాలు పిరం కానున్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇండ్ల రుణాలపై వడ్డీరేట్లు పెంచేశాయి. ఆర్బీఐ రెపోరేట్ 0.25 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్న మరుసటి రోజు బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అన్ని రుణాలపై వడ్డీరేట్లు పెంచడం గమనార్హం. రెండు బ్యాంకులు వడ్డీరేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.
దీంతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ రెపోరేట్ లింక్డ్ లెండింగ్ రేట్ (ఆర్ఎల్ఎల్ఆర్) 25 బేసిక్ పాయింట్లు పెరగడంతో వడ్డీరేటు 8.75 నుంచి తొమ్మిది శాతానికి చేరుతుందని రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. వడ్డీరేట్ల పెంపు గురువారం నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించింది. కీలక ద్రవ్యోల్బణం ఇంకా ఆందోళనకరంగానే ఉందంటూ బుధవారం ఆర్బీఐ రెపోరేట్ 25 బేసిక్ పాయింట్లు పెంచిన సంగతి తెలిసిందే. గతేడాది మే నుంచి ఆర్బీఐ రెపోరేట్ పెంచడం ఇది ఆరోసారి. ఇప్పటి వరకు ఆర్బీఐ తన రెపోరేట్ 250 బేసిక్ పాయింట్లు పెంచింది.
బ్యాంక్ ఆఫ్ బరోడా తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్) అన్ని రకాల రుణాలపై ఐదు బేసిక్ పాయింట్లు పెంచేసింది. ఈ నెల 12 నుంచి పెంచిన వడ్డీరేట్లు అమల్లోకి వస్తాయని గురువారం రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. దీంతో ఓవర్ నైట్ రుణాలపై బీవోబీ ఎంసీఎల్ఆర్ 7.85 నుంచి 7.90 శాతానికి చేరుతుంది. నెల రోజుల గడువు గల రుణాలపై 8.15 నుంచి 8.20 శాతానికి, మూడు నెలల టెన్యూర్ రునాలపై 8.25 నుంచి 8.30 శాతానికి, ఏడాది గడువు గల రుణాల ఎంసీఎల్ఆర్ 8.5 నుంచి 8.55 శాతానికి చేరుతుంది.