Home Loans | బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) బాటలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ప్రయాణించనున్నది. ఇండ్ల రుణాలపై వడ్డీరేటు 20 బేసిక్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అంటే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (మహాబ్యాంక్) నుంచి మంజూరు చేసే ఇండ్ల రుణాలపై 8.4 శాతం నుంచి వడ్డీరేటు అమలవుతుంది. ఈ నెల 13 నుంచి ఈ నెలాఖరు వరకు తగ్గించిన వడ్డీరేట్లు అమల్లోకి వస్తాయని తెలిపింది. ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుతుండటంతో ఇండ్ల రుణాల వృద్ధికోసం బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఈ నిర్ణయం తీసుకున్నది.
క్రెడిట్ స్కోర్ 800 పాయింట్లు, అంతకంటే ఎక్కువగా ఉన్న రుణ గ్రహీతలకు వడ్డీరేట్ల తగ్గింపు అమలవుతుంది. ప్రస్తుతం వేతన జీవులకు ఇండ్ల రుణాలపై వడ్డీరేట్లు 8.60-10.30 శాతంగా ఉన్నాయి. అదీ కూడా సంబంధిత రుణ గ్రహీతల క్రెడిట్ ప్రొఫైల్ను బట్టి వడ్డీరేట్లు ఖరారవుతాయని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వెబ్సైట్ పేర్కొన్నది.
ఇప్పటికే బంగారం, ఇండ్లు, కార్ల రుణాలపై ఫెస్టివ్ ఆఫర్ కింద బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పూర్తిగా ప్రాసెసింగ్ ఫీజు మాఫీ చేసింది. కానీ, ప్రాసెసింగ్ ఫీజు మాఫీ ఎప్పటివరకు అన్న విషయమై స్పష్టతనివ్వలేదు. ఏప్రిల్ మొదటి వారంలో ఆర్బీఐ ద్రవ్యపరపతి సమీక్ష వెల్లడించిన తర్వాత బ్యాంకులు తమ వడ్డీరేట్లను సమీక్షించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నది. కాగా, 2021-22తో పోలిస్తే గత జనవరి నాటికి ఇండ్ల రుణాలు 15.4 శాతం పెరిగి రూ.18.88 లక్షల కోట్లకు పెరిగాయని ఆర్బీఐ గణాంకాలు చెబుతున్నాయి.
సిబిల్ స్కోర్ 751 పాయింట్ల కంటే ఎక్కువగా ఉన్న వారికి ఇండ్లరుణాలపై వడ్డీరేట్లు తగ్గిస్తున్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ నెల ఐదో తేదీన ప్రకటించింది. ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఇండ్ల రుణాలు తీసుకునే వారికి (వేతన జీవులు) 8.90-10.50 శాతం మధ్య ఉన్నాయి. తాజా నిర్ణయం ప్రకారం సంబంధిత రుణ గ్రహీతల క్రెడిట్ (సిబిల్) స్కోర్ 7510 పాయింట్లు, అంతకంటే ఎక్కువగా ఉంటే 50 బేసిక్ పాయింట్లు వడ్డీ రేటు తగ్గించింది.