Hindenburg | న్యూఢిల్లీ, మార్చి 23: అదానీ గ్రూప్ అవకతవకలపై సంచలన రిపోర్ట్ విడుదల చేసి భారత్లో రాజకీయ, మార్కెట్ ప్రకంపనలు సృష్టించిన అమెరికా హెడ్జ్ ఫండ్ హిండెన్బర్గ్.. తాజాగా అమెరికా పేమెంట్స్ దిగ్గజం ‘బ్లాక్’పై విరుచుకుపడింది. తొలుత ‘మరో పెద్ద’ కుంభకోణాన్ని వెలికితీశామని, త్వరలో కొత్త రిపోర్ట్-ఇంకో బిగ్ షాట్ అంటూ గురువారం ఉదయం హిండెన్బర్గ్ రీసెర్చ్ ఒక బ్లాగ్పోస్ట్లో వెల్లడించింది. అయితే కొద్ది గంటలకే హిండెన్బర్గ్.. ‘బ్లాక్’లో షార్ట్ పొజిషన్లు తీసుకున్నట్టు తెలిపింది. ట్విట్టర్ మాజీ సీఈవో జాక్ డోర్సే నెలకొల్పిన బ్లాక్ పలు క్రిమినల్ కార్యకలాపాలకు పాల్పడిందని హిండెన్బర్గ్ తెలిపింది.
బ్లాక్ క్యాష్ యాప్లో లావాదేవీలు జరిపే వినియోగదారుల సంఖ్యను విపరీతంగా పెంచి చూపించిందని నో యువర్ కస్టమర్, యాంటీ మనీలాండరింగ్ చట్టాల్ని ఉల్లంఘించిందని ఆరోపించింది. బ్యాంక్ ఖాతాలు లేని కస్టమర్లు క్రిమినల్, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు బ్లాక్ సర్వీసులు అందించిందని పేర్కొంది. బ్లాక్ ఖాతాల్లో 75 శాతం వరకూ నకిలీవేనన్నది. రెండేండ్ల పాటు జరిపిన దర్యాప్తు వివరాల్ని తెలుపుతూ తన వెబ్సైట్లో రిపోర్ట్ స్క్రీన్ షాట్లను పొందుపర్చింది.
దేశీ మార్కెట్లో ప్రకంపనలు
హిండెన్బర్గ్ తొలి హెచ్చరిక భారత స్టాక్ మార్కెట్లో ప్రకంపనలు సృష్టించింది. మరో భారత్ కంపెనీపైనే ఇది గురిపెట్టినట్టు అనుమానాలు వ్యాపించాయి. దీంతో ఆసియా అంతటా పాజిటివ్ ట్రేడింగ్ కొనసాగుతున్నప్పటికీ, హిండెన్బర్గ్ పోస్ట్తో కొన్ని పెద్ద కంపెనీల షేర్లు, బ్యాంకింగ్ షేర్లు క్షీణించాయి. మరో భారీ కార్పొరేట్పై గురిపెట్టినట్టు ప్రకటించడంతో రాజకీయ వర్గాల్లో సైతం ఆతృత వ్యక్తమయ్యింది. ప్రపంచంలోనే రెండో పెద్ద శ్రీమంతుడిగా ఉన్న గౌతమ్ అదానీ గ్రూప్పై హిండెన్బర్గ్ నివేదిక వెలువడిన తర్వాత శ్రీమంతుల జాబితాలో ఆయన 23వ స్థానానికి దిగివచ్చారు. గౌతమ్ అదానీ కుటుంబ సంపద 150 బిలియన్ డాలర్ల నుంచి మూడో వంతు 53 బిలియన్ డాలర్ల వద్దకు పడిపోయింది. అటు గ్రూప్ షేర్లు నిలువునా పతనంకావడంతో పాటు అదానీ రిపోర్ట్ ఉదంతం పార్లమెంటులో పెను దుమారాన్ని రేపింది. ప్రధాని నరేంద్ర మోదీ, గౌతమ్ అదానీల మధ్య సంబంధాల పట్ల ప్రతిపక్షాలు విరుచుకుపడిన సంగతి విదితమే.