ముంబై, డిసెంబర్ 26: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సువెన్ ఫార్మాస్యూటికల్స్ను గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ అడ్వెంట్ ఇంటర్నేషనల్ చేజిక్కించుకుంటున్నది. సువెన్ ప్రమోటర్లయిన జాస్తి కుటుంబం నుంచి 50.1 శాతం మెజారిటీ వాటాను స్వంతం చేసుకుంటున్నట్టు అడ్వెంట్ సోమవారం ప్రకటించింది. ఈ డీల్ విలువ రూ. 6,312 కోట్లు ఉండవచ్చని అంచనా. కంపెనీలో ప్రధాన వాటాను కొన్న తర్వాత సెబీ టేకోవర్ నిబంధనల ప్రకారం పబ్లిక్ షేర్హోల్డర్ల నుంచి 26 శాతం వాటా కొనుగోలుకు ఓపెన్ ఆఫర్ జారీచేయనున్నట్టు పీఈ సంస్థ తెలిపింది.
వాటా కొనుగోలుకు మరో అంతర్జాతీయ పీఈ ఫండ్ బ్లాక్స్టోన్ పోటీపడగా, అడ్వెంట్ ఆఫర్ను తమ డైరెక్టర్ల బోర్డు ఆమోదించినట్టు సువెన్ ఫార్మా స్టాక్ ఎక్సేంజీలకు తెలిపింది. షేరుకు రూ.495 ధరతో 26 శాతం పబ్లిక్ వాటా కొనుగోలుకు అడ్వెంట్ ఓపెన్ ఆఫర్ జారీచేస్తుందని సువెన్ వెల్లడించింది. ఈ వార్త నేపథ్యంలో బీఎస్ఈలో సువెన్ ఫార్మా షేరు 5.22 శాతం క్షీణించి రూ.472.20 వద్ద ముగిసింది. తమ వ్యాపారంలో అడ్వెంట్ వ్యూహాత్మక ఇన్వెస్టరుగా ఉంటుందని సువెన్ మేనేజింగ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు జాస్తి తెలిపారు. ‘హెల్త్కేర్లో నైపుణ్యం, నిపుణులతో కూడిన గ్లోబల్ నెట్వర్క్ కలిగిన అడ్వెంట్ మాకు సరైన భాగస్వామి, సువెన్ ఫార్మా తదుపరి వృద్ధికి వారి నైపుణ్యం తోడ్పడుతుంది’ అని జాస్తి చెప్పారు.
సువెన్లో కొహెన్స్ లైఫ్సైన్సెస్ విలీనం!
టేకోవర్ పూర్తయిన తర్వాత అడ్వెంట్ తన పోర్ట్ఫోలియో కంపెనీ అయిన కొహెన్స్ లైఫ్సైన్సెస్ను సువెన్లో విలీనం చేయాలని యోచిస్తున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. తద్వారా కాంట్రాక్ట్ డెవలప్మెంట్, మాన్యుఫాక్చరింగ్, ఏపీఐ, స్పెషాలిటీ కెమికల్స్ చైన్లో ప్రధాన కంపెనీగా వృద్ధి చేయాలన్నది అడ్వెంట్ లక్ష్యంగా చెపుతున్నారు. జాస్తి కుటుంబం సువెన్ ఫార్మాస్యూటికల్స్ను తన మాతృసంస్థ సువెన్ లైఫ్సైన్సెస్ నుంచి విభజించి 2020లో వేరుగా లిస్ట్ చేసింది. ఇందులో ప్రమోటర్లకు 60 శాతం వాటా ఉన్నది. తాజా విక్రయంతో ఈ కుటుంబం వాటా 9.9 శాతానికి పరిమితమవుతుంది.