న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: అంతర్జాతీయ సంస్థలు వరుసపెట్టి భారత వృద్ధి రేటుకు కోత పెడుతున్న సమయంలోనే మరో ప్రపంచ సంస్థ సైతం కత్తెరవేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి దేశ జీడీపీ వృద్ధి అంచనాల్ని ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) తగ్గించింది. అధిక ద్రవ్యోల్బణం, కఠిన ద్రవ్య విధానం కారణంగా వృద్ధి రేటును 7.2 శాతం నుంచి 7 శాతానికి కుదిస్తున్నట్టు ఏడీబీ ప్రకటించింది.
ఆసియన్ డెవలప్మెంట్ అవుట్లుక్ రిపోర్ట్ 2022ను బుధవారం విడుదల చేస్తూ 2022-23 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో సర్వీసుల అండతో భారత్ జీడీపీ 13.5 శాతం వృద్ధి సాధించిందని, అయితే పూర్తి ఏడాదిలో ఈ వృద్ధి 7 శాతానికి పరిమితమవుతుందని, 2023-24లో 7.2 శాతంగా నమోదుకావచ్చని తెలిపింది. భారత్ వృద్ధి రేటును ఏడీబీ తగ్గించడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. ఏప్రిల్లో విడుదల చేసిన నివేదికలో 7.5 శాతం వృద్ధిని అంచనావేయగా, జూలైలో దీనిని 7.2 శాతానికి, తాజాగా 7 శాతానికి దించింది.