Adani Wilmar | ఫుడ్ సెగ్మెంట్లో అదానీ విల్మార్ తన స్థానాన్ని మరింత పదిల పర్చుకుంటున్నది. స్విట్జర్లాండ్కు చెందిన కోహినూర్ బ్రాండ్ను సొంతం చేసుకున్నది. ఈ బ్రాండ్ను సొంతం చేసుకోవడంతో అదానీ విల్మార్కు భారత్లో కొహినూర్ అనుబంధ బాస్మతి రైస్, రెడీ టూ కుక్, రెడీ టు ఈట్ అనే మీల్స్, కూరల పోర్ట్ ఫోలియో హక్కులు దఖలు పడతాయి. కోహినూర్ బ్రాండ్తో ఎఫ్ఎంసీజీ సెక్టార్లో తమ స్థానాన్ని బలోపేతం చేసుకునేందుకు వీలు కలుగుతుందని అదానీ విల్మార్ విశ్వసిస్తున్నది.
కోహినూర్ బ్రాండ్ కింద ప్రీమియం బాస్మతి రైస్, చార్మినార్-చౌక బియ్యం, హొరెకా హోటల్ ఉన్నాయి. ప్యాకేజ్డ్ ఫుడ్ క్యాటగిరీలో వృద్ధి సాధించడానికి ఈ ఒప్పందం వెసులుబాటు కల్పిస్తుందని అదానీ విల్మార్ భావిస్తున్నది. అదానీ విల్మార్ సీఈవో కం ఎండీ అంషు మల్లిక్ మాట్లాడుతూ ఫుడ్ ఎఫ్ఎంసీజీ క్యాటగిరీలో నాయకత్వ స్థానానికి వెళ్లేందుకు కొహినూర్ బ్రాండ్ చేయూతనిస్తుందని చెప్పారు.
తృణ ధాన్యాలతో తయారుచేసే రెడీ టు కుక్ కిచిడీ వంటి ఉత్పత్తులను, సోయా ముక్కలు,గోధుమ పిండి, బియ్యం, పప్పులు, పంచదార తదితర ప్యాకేజ్డ్ ఫుడ్స్ విభాగంలో అదానీ విల్మార్ పూర్తి ఆధిపత్యం సాధించింది. అయితే, కొహినూర్ బ్రాండ్ సొంతం చేసుకోవడానికి స్విట్జర్లాండ్కు చెందిన మెక్ కర్మిక్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం విలువ ఎంత అనే విషయం అదానీ విల్మార్ వెల్లడించలేదు.