Adani on Green Energy | వచ్చే పదేండ్లలో సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తి కోసం 20 బిలియన్ డాలర్ల పై చిలుకు పెట్టుబడులు పెట్టనున్నట్లు అదానీ గ్రూప్ ప్రకటించింది. గ్రీన్ ఎనర్జీ వాల్యూ చైన్లో ఆర్గానిక్, ఇనార్గానిక్ ఇన్వెస్ట్మెంట్లు కలిపి 50 నుంచి 70 బిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెడతామని అదానీ గ్రూప్ అధినేత గౌతం అదానీ చెప్పారు. సోమవారం ఆయన టీఐఈ సస్టెయినబిలిటీ సమ్మిట్- 2021 (టీఎస్ఎస్)లో కీలకోపన్యాసం చేశారు. 2030 నాటికి సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తిలో భారత్ను మొదటి స్థానంలో నిలపడమే తమ లక్ష్యం అని గౌతం అదానీ అన్నారు.
ఇందుకోసం ఎలక్ట్రోలైజర్ మాన్యుఫాక్చరింగ్తోపాటు సౌర, పవన విద్యుత్ బిజినెస్లో సురక్షిత చైన్, కృత్రిమ మేధ ఆధారిత ఇండస్ట్రీయల్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ ఏర్పాటు చేస్తామని గౌతం అదానీ పేర్కొన్నారు. వచ్చే నాలుగేండ్లలో సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని మూడు రెట్లు పెంచడమే తమ లక్ష్యం అని అన్నారు. షెడ్యూల్ ప్రకారం నాలుగేండ్లలో ప్రారంభంలో 25 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యమన్నారు.