న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: అదానీ కంపెనీల షేర్ల విలువలు వ్యాపారంతో సంబంధం లేకుండా కృత్రిమంగా పెరిగిపోయాయని అంతర్జాతీయ వాల్యుయేషన్ గురు అశ్వథ్ దామోదరన్ వ్యాఖ్యానించారు. ప్రస్తుత రూ. 1,531 ధర వద్ద అదానీ ఎంటర్ప్రైజెస్ షేరు చాలా అధిక విలువతో కూడినదని, రూ.945 దానికి సరైన ధర అని తెలిపారు. హిండెన్ బర్గ్ నివేదిక వెలువడక ముందు రూ. 3,400 సమీపంలో ఉన్న అదానీ ఎంటర్ప్రైజెస్ ఇప్పటికే సగానికి పైగా కుప్పకూలింది. ఇంత పతనమైనా కూడా ఈ విలువ చాలా ఎక్కువంటూ న్యూయార్క్ యానివర్సిటీలోని స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో కార్పొరేట్ ఫైనాన్స్, వాల్యుయేషన్ బోధించే దామోదరన్ వివరించారు. తాజాగా ఆయన ఒక బ్లాగ్పోస్ట్లో అదానీ గ్రూప్ ఫండమెంటల్స్ను విశ్లేషించారు. ఆ గ్రూప్ వ్యాపారాలు చేసే రంగాలు, వాటి పనితీరు, యాజమాన్య వాటా తదితరాలను పరిగణనలోకి తీసుకుని విశ్లేషణ చేశారు. ఆయన ఏం చెప్పారంటే…
అదానీ గ్రూప్ ప్రధాన వ్యాపారం
ఫుడ్ ప్రాసెసింగ్ వ్యాపారాన్ని నిర్వహించే అదానీ విల్మార్ మినహా మిగిలిన గ్రూప్ కంపెనీలన్నీ మౌలిక రంగ కార్యకలాపాల్లోనే ఉన్నాయి. మౌలిక రంగ వ్యాపారాల్లో ముందస్తుగానే భారీ పెట్టుబడులు చేయాల్సి ఉంటుంది. రాబడులు దీర్ఘకాలంలోనే వస్తాయి. రెగ్యులేటరీ, ప్రభుత్వ నిబంధనలు అధికం. ఎనర్జీ (గ్రీన్ ఎనర్జీ, గ్యాస్ ట్రాన్స్మిషన్/డిస్ట్రిబ్యూషన్)లో గ్రూప్ పెట్టుబడుల వాటా పెరుగుతున్నది. అయితే లాజిస్టిక్స్, ప్రత్యేకించి ఎయిర్పోర్టులు, రేవుల్లో ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ ప్రధాన పెట్టుబడులున్నాయి. ఈ వ్యాపారాల్లో ఒక్కోదానినీ, ఒక స్టాండెలోన్ అదానీ కంపెనీ నిర్వహిస్తున్నా, అదానీ ఎంటర్ప్రైజెస్ ద్వారానే పెట్టుబడులు ప్రవహిస్తున్నాయని దామోదరన్ వివరించారు.
పదేండ్ల క్రితం టాప్-10 గ్రూప్ల్లో లేదు
ఆదాయం, మార్కెట్ విలువ, సంస్థల నికర విలువ-ఏ ప్రకారం చూసినా పదేండ్ల క్రితం భారత్లోని టాప్-10 పారిశ్రామిక గ్రూప్ల్లో అదానీ గ్రూప్ లేదని దామోదరన్ తెలిపారు. అదే 2023 ప్రారంభంలోనే మార్కెట్ విలువ ప్రకారం దేశంలోని టాప్-20 కంపెనీల్లో నాలుగు అదానీ గ్రూప్ కంపెనీలున్నాయన్నారు. ఏడు అదానీ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ 220 బిలియన్ డాలర్లకు (రూ.17.60 లక్షల కోట్లు) చేరింది. ఇండియాలో అతిపెద్ద కంపెనీ అంబానీ కుటుంబానికి చెందిన రిలయన్స్ మార్కెట్ విలువ కంటే అదానీ కంపెనీల మార్కెట్ విలువ ఎక్కువైపోయిందన్నారు.
రాబడి కోసం దశాబ్దాలు ఎదురుచూడాలి
ఇన్వెస్టర్లు చేసిన పెట్టుబడులపై లాభాల కోసం దశాబ్దాలు ఎదురుచూడాల్సిన ఇన్ఫ్రా వ్యాపారాల్లో ఒక కుటుంబం అధ్వర్యంలోకి వాణిజ్య గ్రూప్ నాటకీయంగా మార్కెట్ విలువను పెంచుకోవడం పట్ల వాల్యుయేషన్గురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇవి ఎప్పటికప్పుడు విలువలు మారిపోయేవి కాదు. 2002-2015 మధ్య అదానీ ఎంటర్ప్రైజెస్ ఆదాయం క్రమేపీ పెరిగింది. తక్కువ లాభదాయకత నమోదయ్యింది. 2016-2021 మధ్యలో ఆదానీ ఎంటర్ప్రైజెస్ నుంచి అదానీ పోర్ట్స్, అదానీ పవర్, అదానీ ట్రాన్స్మిషన్లను ప్రత్యేక కంపెనీలుగా వేరుచేశారు. అటుతర్వాత ఇటీవలి ఒకటిన్నర సంసత్సరంలో అదానీ ఎంటర్ప్రైజెస్ అదాయం బాగా పెరినట్టు దామోదరన్ గుర్తించారు. అయితే అదానీ గ్రూప్ పూర్తి ఆపరేటింగ్ చరిత్రలో నిర్వహణా లాభాలు అల్పంగానే ఉన్నాయన్నారు. వాస్తవానికి చూస్తే అదానీ వ్యాపారాలన్నీ వాటి మూలధనం ఖర్చుల్ని సంపాదించడానికి ఇబ్బంది పడుతున్నట్టే కన్పిస్తున్నదన్నారు.
ఏ రీతిలో చూసినా షేరు ధర ఎక్కువే
గత రెండేండ్లుగా జరిగిన అదానీ ఎంటర్ప్రైజెస్ షేరు ర్యాలీ ఏ ఫండమెంటల్స్తో గణించినా ఎక్కువే. ఈ షేరు పీఈ రేషియో (లాభంతో పోలిస్తే షేరు ధర) 2016-21 మధ్యకాలంలో 15 రెట్లు ఉండగా, ఇటీవల అనూహ్యంగా 214 రెట్లకు పెరిగింది. 2016-21లో ఇబిటా (వడ్డీ, పన్నులు, తరుగుదలకు ముందు లాభం)కు 12 రెట్లు ఉన్న కంపెనీ నెట్వర్త్ (నికర విలువ) గత రెండేండ్లుగా 53 రెట్లుకు పెరిగిందని అశ్వథ్ దామోదరన్ వివరించారు. ఆదాయానికంటే తక్కువగా ఉన్న కంపెనీ మార్కెట్ విలువ ఇటీవల 2.71 రెట్లకు పెరిగిందన్నారు. షేరు ధరల పెరుగుదలతో అదానీ గ్రూప్ కంపెనీల విలువ రూ.17.60 లక్షల కోట్లకు, అదానీ ఎంటర్ప్రైజెస్ విలువ రూ.4.24 లక్షల కోట్లకు చేరినపుడు వాటి విలువ ఖచ్చితంగా ఎక్కువేనని స్పష్టం చేశారు. ‘అదానీ గ్రూప్ మోసాలపై హిండెన్బర్గ్ చేసిన ఆరోపణల్ని పక్కకు పెట్టిన తర్వాత కూడా..అదానీ ఎంటర్పైజెస్ ఆదాయ వృద్ధి, ఆపరేటింగ్ మార్జిన్లు పరిగణనలోకి తీసుకుంటే ఆ కంపెనీ షేరుకు సరైన విలువ రూ.945 మాత్రమే’ అని వాల్యుయేషన్ గురు వెల్లడించారు. ప్రస్తుత రూ.1,531ధర వద్ద సైతం కంపెనీ విలువ ఖరీదైనదన్నారు.
భారీ రుణ భారం
అదానీ ఎంటర్ప్రైజెస్ వృద్ధికి గత 20 ఏండ్లలో ఎల్లప్పుడూ రుణాలపైనే ఆధారపడుతున్నది. తాజా రుణాన్ని సమీకరించినప్పటికీ, షేర్హోల్డర్లకు డివిడెండ్లు చెల్లిస్తున్నది. 2016-2021 మధ్యకాలంలోనైతే డివిడెండ్ల చెల్లింపునకు రుణాల్నే ఉపయోగించుకుందని న్యూయార్క్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వివరించారు. క్యాపిటల్తో పోలిస్తే డెట్ నిష్పత్తి ఎప్పుడూ ఎక్కువగానే ఉన్నదన్నారు. ఇటీవల కాలంలో మాత్రం ఇన్వెస్టర్ల నుంచి బ్యాంకర్ల నుంచి ఒత్తిడి కావొచ్చు..రుణ భారాన్ని తగ్గించుకునేందుకు తాజా ఈక్విటీ మూలధనాన్ని సమీకరించాలని చూస్తున్నదన్నారు.