Adani-Ambuja Cement | గౌతం అదానీ.. అదానీ గ్రూప్.. యూఎస్ షార్ట్ షెల్లర్ కంపెనీ హిండెన్బర్గ్ రీసెర్చ్.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రజల నోళ్లలో నానుతున్న పేర్లు. పన్ను స్వర్గధామాలుగా పేరొందిన దేశాలను కేంద్రంగా చేసుకుని అదానీ గ్రూప్ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్లో ఫ్రాడ్ చేసిందని, అకౌంటింగ్లో అవకతవకలు జరిగాయని, ఆస్తుల కంటే అప్పులు ఎక్కవ అని పేర్కొంటూ హిండెన్బర్గ్.. గత జనవరి 24 నివేదిక బహిర్గతం చేసింది.
నాటి నుంచి అదానీ గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్, గౌతం అదానీ వ్యక్తిగత సంపద సగానికి పైగా హరించుకపోయాయి. ఈ నేపథ్యంలో గౌతం అదానీ సారధ్యంలోని అదానీ గ్రూప్ కీలక నిర్ణయం తీసుకున్నదని సమాచారం. ఇన్వెస్టర్లలో పునఃవిశ్వాసం కల్పించే లక్ష్యంతో అదానీ గ్రూప్ ముందుకు సాగుతున్నదని తెలిసింది. రుణాల భారం తగ్గించుకునేందుకు అంబుజా సిమెంట్స్లో 450 మిలియన్ డాలర్ల విలువైన షేర్లను విక్రయించాలని నిర్ణయానికి వచ్చినట్లు ఆ సంస్థ వర్గాలు తెలిపాయి. అధికారికంగా స్పందించేందుకు అదానీ గ్రూప్ అందుబాటులోకి రాలేదు.
ప్రస్తుతం ఇన్వెస్టర్లలో అపనమ్మకాన్ని తొలగించేందుకు ప్రయత్నిస్తున్న అదానీ గ్రూప్.. గతేడాది భారత్లో హోల్సిమ్ ఏజీ సిమెంట్స్ సంస్థలు అంబుజా సిమెంట్స్, ఏసీసీ సిమెంట్స్ను 10.5 బిలియన్ డాలర్లకు టేకోవర్ చేసింది. కానీ, హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదిక నేపథ్యంలో తలెత్తిన ఇబ్బందులను అధిగమించేందుకు.. ముందస్తుగా రుణాల చెల్లింపునకు అదానీ గ్రూప్ సిద్ధమైందని, అందుకే అంబుజా సిమెంట్స్లో వాటాలు విక్రయించనున్నదని వినికిడి.
గత కొన్ని రోజులుగా అదానీ గ్రూప్ సంస్థలు తీసుకున్న రుణాల ముందస్తు చెల్లింపుపైనే గౌతం అదానీ, ఆయన కుటుంబం దృష్టి సారించిందని తెలుస్తున్నది. లండన్లో జరిగిన ఇన్వెస్టర్ల మీట్లో అదానీ గ్రూప్ సీనియర్ ఎగ్జిక్యూటివ్లు ఈ సంగతి చెప్పినట్లు బ్లూంబర్గ్ న్యూస్ ఇటీవల ఓ వార్తా కథనం ప్రచురించింది. శుక్రవారం దేశీయ మార్కెట్లో అంబుజా సిమెంట్స్ 1.7శాతం, ఏసీసీ సిమెంట్స్ 0.7 శాతం నష్టాలతో ముగిశాయి.