న్యూఢిల్లీ, జూలై 11: స్టాక్ ధరల్లో అదానీ గ్రూప్ అక్రమాలపై వచ్చిన ఆరోపణలపై సాగుతున్న దర్యాప్తు ఎక్కడిదాకా వచ్చిందంటూ మంగళవారం మార్కెట్ రెగ్యులేటర్ సెబీని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. విచారణను వేగంగా జరుపాలని, తామిచ్చిన గడువు ఆగస్టు 14లోగా పూర్తిచేయాలని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని అత్యున్నత న్యాయస్థాన త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే వీలైనంత త్వరగానే దర్యాప్తును చేస్తున్నట్టు ఈ కేసులో సెబీ తరఫున వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహెతా కోర్టుకు తెలిపారు.
కాగా, ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టు ఓ నిపుణుల కమిటీని కూడా నియమించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ కమిటీ కోర్టుకు తమ నివేదికనూ సమర్పించిన సంగతి విదితమే. దీంతో సదరు కమిటీ తమ నివేదికలో సూచించిన సలహాలపై సెబీ తమ నిర్మాణాత్మక స్పందనను సోమవారమే తెలియజేసిందంటూ ఈ సందర్భంగా ధర్మాసనానికి మెహెతా వెల్లడించారు. ఈ నేపథ్యంలో మీకిచ్చిన గడువులోగా దర్యాప్తును పూర్తి చేయాలని మెహెతా ద్వారా సెబీకి మరోమారు కోర్టు గుర్తుచేసింది. అదానీ గ్రూప్పై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తును పూర్తి చేసేందుకు సెబీకి వచ్చే నెల 14దాకా గడువిస్తూ సుప్రీం కోర్టు ఈ ఏడాది మే 17న నిర్ణయించింది.