Adani Power | మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడబెట్టడంలో గౌతం అదానీ సారధ్యంలోని అదానీ గ్రూప్ సంస్థలు జోరు మీదున్నాయి. అదానీ గ్రూప్లో ఆరో సంస్థ అదానీ పవర్ రూ. లక్ష కోట్ల మార్కెట్ క్యాపిటల్ మైలు రాయి దాటిన ఆరో కంపెనీగా నిలిచింది. సోమవారం ట్రేడింగ్లో అదానీ పవర్ షేర్ విలువ ఆల్టైం రికార్డు స్థాయిలో రూ.272 పలికింది.
బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ)లో సోమవారం మధ్యాహ్నం ట్రేడింగ్ సమయంలో అదానీ పవర్ స్టాక్ ఐదు శాతం పుంజుకుని రూ.272.15లకు చేరుకున్నది. దీంతో ఈ సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,04, 966.59 కోట్ల మైలురాయిని దాటేసింది. గత ఎనిమిది నెలల్లో అదానీ పవర్ స్క్రిప్ట్ దాదాపు 290 శాతం పెరిగింది.
అంతకుముందు గతేడాది ఆగస్టు 24వ తేదీన 52 వారాల కనిష్ట స్థాయిని తాకింది. గత నెల రోజులుగా అదానీ పవర్ షేర్లు 100 శాతానికి పైగా లాభ పడ్డాయి. అంతకుముందు అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్సిమిషన్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ సంస్థలు రూ.లక్ష కోట్ల మార్కెట్ క్యాపిటల్ మార్క్ను చేరుకున్నాయి.