Adani-Hindenburg | బిలియనీర్ గౌతం అదానీ సారధ్యంలోని అదానీ గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 100 బిలియన్ డాలర్ల దిగువకు పతనమైంది. సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో అదానీ గ్రూప్ స్టాక్స్లో అత్యధికంగా నష్టపోయాయి. ప్రత్యేకించి అదానీ గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్ ప్రైజెస్ 9.4 శాతం నష్టపోయింది. గత జనవరి 24న అమెరికా షార్ట్ షెల్లర్ కంపెనీ హిండెన్బర్గ్ రీసెర్చ్ ఆరోపణలతో కూడిన నివేదిక వెలువరించినప్పటి నుంచి సోమవారం వరకు అదానీ గ్రూప్ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ 135 బిలియన్ డాలర్లకు పైగా ఆవిరైంది.
అదానీ గ్రూప్ సంస్థల షేర్లలో అత్యధికం అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. అదానీ టోటల్ గ్యాస్ షేర్ అత్యధికంగా నష్టపోయింది. సోమవారం ఇంట్రాడే ట్రేడింగ్లో కనిష్ట స్థాయిని తాకింది. అదానీ గ్రూప్లోని తొమ్మిది స్టాక్స్ నష్టాల్లోనే ముగిశాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్మిషన్ ఐదు శాతం చొప్పున నష్టపోయాయి. ఎన్డీటీవీ 3.75 శాతం, అదానీ విల్మార్ 2.38 శాతం, అంబుజా సిమెంట్ 1.09, అదానీ పవర్ ఐదు శాతం, అదానీ పోర్ట్స్ 0.24 శాతం, ఏసీసీ 0.87 శాతం చొప్పున నష్టాలతో ముగిశాయి.
హిండెన్బర్గ్ రీసెర్చ్ ఆరోపణలపై అమెరికా న్యాయపరంగా ఎదుర్కొనేందుకు అదానీ గ్రూప్ `వాచ్టెల్ లిప్టెన్, రోజెన్ అండ్ కట్జ్` అనే న్యాయసంస్థను నియమించుకున్నట్లు వార్తలొచ్చాయి. మరోవైపు ఖర్చులు తగ్గించుకోవడానికి సెంట్రల్ ఇండియాలో 850 మిలియన్ డాలర్ల విలువైన కోల్ ప్లాంట్ కొనుగోలు ఒప్పందం రద్దు చేసుకున్నది అదానీ గ్రూప్.
కొన్ని రుణాల చెల్లింపులు, చెల్లిస్తామన్న హామీలతో రుణ దాతలను ఒప్పించేందుకు అదానీ గ్రూప్ సంస్థల ఎగ్జిక్యూటివ్లు ఆయా సంస్థలతో వరుసగా సమావేశం అవుతున్నారు. అదానీ కంపెనీలకు బాండ్లు జారీ చేసిన సంస్థల ప్రతినిధులతో సమావేశమై వారికి నచ్చచెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే తమ సంస్థలకు గతేడాది సెప్టెంబర్ నాటికి రుణ భారం రూ.1.96 లక్షల కోట్లు మాత్రమే అదానీ గ్రూప్ చెబుతున్నది.