Gautam Adani | న్యూఢిల్లీ, మార్చి 16: హిండెన్బర్గ్ రిసెర్చ్ దెబ్బ నుంచి కోలుకుంటున్న అదానీ గ్రూప్పై మరో పిడుగు పడింది. అదానీ గ్రూప్, దాని అధినేత గౌతమ్ అదానీపై లంచం ఆరోపణల దర్యాప్తును అమెరికా వేగవంతం చేసింది. అదానీ గ్రూప్ లేదా గౌతమ్ అదానీసహా గ్రూప్లోని ఆయా సంస్థల ఉన్నత వర్గాలు.. ఓ ఎనర్జీ ప్రాజెక్ట్కు సహకరించాలని భారతీయ అధికారులకు ముడుపులు చెల్లించడంలో భాగమయ్యారా? అన్న కోణంలో అగ్రరాజ్య ప్రాసిక్యూటర్లు విచారణ జరుపుతున్నారు. అమెరికాలోని న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం, వాషింగ్టన్లోని ఫ్రాడ్ యూనిట్.. ఈ దర్యాప్తును చేస్తున్నది. కాగా, దేశీయ రెన్యువబుల్ ఎనర్జీ కంపెనీ అజుర్ పవర్ గ్లోబల్పైనా ఇన్వెస్టిగేషన్ వర్గాలు ఓ కన్నేశాయి.
అదానీ గ్రూప్ అక్రమాలపై హిండెన్బర్గ్ రిసెర్చ్ రిపోర్టులో వచ్చిన ఆరోపణలు నిజమేనని ఇప్పటిదాకా దేశీయ దర్యాప్తుల్లోనైతే తేలలేదు. అటు సుప్రీం కోర్టు, ఇటు మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ.. వేర్వేరుగా ఈ వ్యవహారంపై దర్యాప్తులు చేపట్టిన సంగతి విదితమే. మరోవైపు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు అండదండలు కూడా అదానీ గ్రూప్కున్నాయని, అందుకే అక్రమాలేవీ బయటకు రావడం లేదన్న వాదనలూ వినిపిస్తున్నాయి. అదానీ డీల్స్ వెనుక మోదీ కూడా ఉన్నారన్న ఆరోపణలు అప్పట్లో బలంగా వచ్చినది తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికాలో అదానీపై దర్యాప్తు వేగవంతం కావడంతో అక్కడైనా అసలు విషయాలు వెలుగులోకి వస్తాయా? అన్నది ఇప్పుడు మిక్కిలి ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది.
మరోవైపు ఈ దర్యాప్తునకు సంబంధించి మాకు ఎలాంటి సమాచారం లేదని అదానీ గ్రూప్ బ్లూంబర్గ్ న్యూస్కు తెలిపింది. అదానీ గ్రూప్తోపాటు, అజుర్ పవర్ వర్గాలూ స్పందించేందుకు నిరాకరించాయి. అమెరికా స్టాక్ మార్కెట్లలో నమోదైనా.. లేక అక్కడి ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టినా.. లేదా ఆ దేశ కంపెనీలతో జాయింట్ వెంచర్ ఉన్నా.. సదరు సంస్థలు ఏ దేశానికి చెందినవైనా అవినీతి ఆరోపణలు వస్తే వాటిపై ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ (ఎఫ్సీపీఏ) కింద అగ్రరాజ్యం దర్యాప్తునకు దిగుతుంది.
ఈ క్రమంలోనే అదానీ గ్రూప్లో అమెరికన్ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టారని, అందుకే భారత్లో జరిగిన ఈ లంచం ఆరోపణలపై విచారణ చేస్తున్నట్టు చెప్తున్నారు. దోషులని తేలితే భారీ జరిమానాలు పడే వీలున్నది. మొత్తానికి గత ఏడాది అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ రిసెర్చ్ రిపోర్టుతో దేశీయ స్టాక్ మార్కెట్లలో అదానీ గ్రూప్ మార్కెట్ విలువ నిలువునా కరిగిపోయినది తెలిసిందే. లక్షల కోట్లలో వాటిల్లిన ఈ నష్టాలను పూడ్చుకుని ఇప్పుడిప్పుడే పూర్వ వైభవాన్ని గౌతమ్ అదానీ సంతరించుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ లంచం ఆరోపణలు మళ్లీ అదానీ సంపదను ఏ రకంగా, ఎంత మేరకు ప్రభావితం చేస్తాయోనన్నది ఊహించలేకుండా ఉన్నది.