సిమెంట్ అదానీదే రోడ్లు అదానీవే ఎయిర్పోర్టు అదానీదే పోర్టు అదానీదే బొగ్గు విద్యుత్తు అదానీదే వ్యవసాయం అదానీదే రైళ్లు అదానీవే ఈ స్పీడ్తో 2024 నాటికి.. భారతదేశం మొత్తం అదానీ ప్రైవేట్ లిమిటెడ్ అవుతుంది.ఇదీ సోషల్ మీడియాలో మార్మోగుతున్న నినాదం.
న్యూఢిల్లీ, మే 16: హమ్ దో.. హమారా దో అన్న మాటలు అక్షర సత్యాలనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? ఇద్దరు గుజరాతీలు కలిసి మరో ఇద్దరు గుజరాతీలకు దేశాన్ని దోచిపెడుతున్నారనడానికి ఇంతకు మించిన నిదర్శనం ఏమి ఉంటుంది. ఒకటి కాదు.. రెండు కాదు.. దోపిడి దొంగల్లా దేశాన్ని దోచుకొంటున్నారనడానికి అదానీ అధీనంలోకి ఒక్కటొక్కటిగా వెళ్లిపోతున్న రంగాలే సాక్ష్యాలు. పోర్టులు, ఎయిర్ పోర్టులు.. రోడ్లు, రైళ్లు.. బొగ్గు, సిమెంట్.. ఇలా దేశంలోని ఒక్కో రంగాన్ని తన గుప్పిట్లోకి తీసుకొంటున్న గుజరాతీ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ.. నిన్న సిమెంట్ రారాజుగా ఆవిర్భవించాడు. ఇప్పుడు మీడియా వ్యాపారంలోకీ ఎంటరయ్యారు. అదానీ ఎంటర్ప్రైజెస్కు చెందిన ఏఎంజీ మీడియా నెట్వర్క్స్.. రాఘవ్ బహ్ల్ నడిపే డిజిటల్ బిజినెస్ న్యూస్ ప్లాట్ఫామ్ క్వింటిలియన్ బిజినెస్ మీడియాను కొనుగోలు చేసింది.
ఈ మీడియా సంస్థలో 49 శాతం వాటాను అదానీ కంపెనీ కొన్నది. ఈ మేరకు నేషనల్ స్టాక్ ఎక్సేంజీలో ఈ నెల 13న రెగ్యులేటరీ ఫైలింగ్ను దాఖలు చేసింది. అయితే ఎంత మొత్తానికి కొనుగోలు చేశారన్నది మాత్రం బయటికి తెలియరాలేదు. ఈ కొనుగోలు వ్యవహారంపై అదానీ ఎంటర్ప్రైజెస్ స్పందించింది. క్వింటిలియన్ మీడియాలోని మైనారిటీ వాటాను కొంటున్నామని పేర్కొన్నది. మీడియా రంగంలో అదానీ గ్రూప్ డీల్ కుదుర్చుకోవటం ఇదే తొలిసారి. గతంలో ఎన్డీటీవీలో వాటాను అదానీ కొంటున్నట్టు వార్తలు వచ్చాయి. వాటిని ఇరువర్గాలు ఖండించాయి. తాజాగా, క్వింటిలియన్లో వాటా అదానీ సొంతమైంది. గుజరాత్కు చెందిన ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా కలిసి.. గుజరాత్కే చెందిన అదానీ, అంబానీలకు దేశాన్ని అప్పనంగా అప్పగిచ్చేస్తున్నారనటానికి ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి? అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దేశాన్ని అప్పుల్లోకి నెట్టి, సంపదనంతా ఆ ఇద్దరికీ దోచిపెడుతున్నారని ఆరోపిస్తున్నారు.