Gautham Adani | భారతీయ కుబేరుడు, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీకి `జడ్` క్యాటగిరీ వీఐపీ భద్రత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీని ప్రకారం ఆయనకు సీఆర్పీఎఫ్ కమెండోలు భద్రత కల్పిస్తారు. అదానీ గ్రూప్ చైర్మన్ ప్రాణాలకు ముప్పు ఉందని కేంద్ర దర్యాప్తు సంస్థలు, ఇంటెలిజెన్స్ బ్యూరో ఇచ్చిన నివేదిక ఆధారంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నది. అఖిల భారత స్థాయిలో గౌతం అదానీకి ఈ భద్రత కల్పిస్తున్నందుకు ప్రతి నెలా రూ.15-20 లక్షల మొత్తం ఆయన చెల్లించాల్సి ఉంటుంది. గౌతం అదానీ సెక్యూరిటీ బాధ్యతలను టేకోవర్ చేయాల్సిందిగా సీఆర్పీఎఫ్ వీఐపీ సెక్యూరిటీ వింగ్ను కేంద్ర హోంశాఖ కోరిందని సమాచారం. ఇప్పటికే సీఆర్పీఎఫ్ భద్రతా బలగాలు గౌతం అదానీకి భద్రత కల్పిస్తున్నాయని అధికార వర్గాల కథనం.
మరో బిలియనీర్ పారిశ్రామికవేత్త, భారత్లో రెండో అతిపెద్ద సంపన్నుడు- రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీకి 2013 నుంచి కేంద్ర ప్రభుత్వం సీఆర్పీఎఫ్ కమెండోతో కూడిన జడ్ ప్లస్ భద్రత కల్పిస్తున్నది. 2016 నుంచి ముకేశ్ అంబానీ భార్య నీతా అంబానీకి సీఆర్పీఎఫ్ కమెండలతో కూడిన `వై` క్యాటగిరీ సెక్యూరిటీ అందిస్తున్నది.
కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్న భద్రతకు ముకేశ్ అంబానీ కుటుంబం ఖర్చులు భరిస్తున్నది. ఈ నేపథ్యంలో ముకేశ్ అంబానీ కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం భద్రత కొనసాగించవచ్చునని గత నెలాఖరు చివర్లో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ముకేశ్ అంబానీ, ఆయన కుటుంబ సభ్యులకు భద్రతా కల్పించడాన్ని సవాల్ ఏస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై త్రిపుర హైకోర్టు తీర్పు సవాల్ చేస్తూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ఆ ఆదేశాలు జారీ చేసింది.