ముంబై, జూలై 21: దేశంలో అత్యంత శ్రీమంతుడు, ప్రపంచ కుబేరుల్లో నాల్గవస్థానంలో ఉన్న గౌతమ్ అదానీ రూ.14,000 కోట్ల రుణం కోసం ఎస్బీఐ తలుపులు తట్టారు. గుజరాత్లోని ముంద్రాలో నిర్మించనున్న పాలీవినైల్ క్లోరైడ్ (పీవీసీ) ప్లాంట్ కోసం అదానీ గ్రూప్ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజాన్ని సంప్రదించిందని సంబంధిత వ్యక్తులు తెలిపారు. ఇటీవలి నెలల్లో బ్యాంకుల చెంతకు వచ్చిన అతిపెద్ద రుణ ప్రతిపాదన ఇదే.
ఈ ఏడాది మార్చిలో నవీముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోసం అదానీ ఎంటర్ప్రైజేస్ తీసుకున్న రూ. 12,770 కోట్లకంటే భారీ రుణ కోసం ఈ గ్రూప్ ఎస్బీఐని ఆశ్రయించింది. ఈ మధ్యకాలంలోనే ముంద్రాలో కొత్తగా కాపర్ రిఫైనరీ ప్రాజెక్ట్ కోసం కూడా అదానీ గ్రూప్ రూ.6,071 కోట్ల అప్పు తీసుకుంది. తాజాగా రుణాన్ని ఉద్దేశించిన పీవీసీ ప్లాంట్లో బొగ్గు, పొటాషియం క్లోరైడ్, సున్నపురాయి, ఉప్పులను ముడి పదార్థాలుగా ఉపయోగించి వివిధ పీవీసీ గ్రేడ్స్ను ఉత్పత్తి చేసేందుకు అదానీ ఎంటర్ప్రైజెస్ సిద్ధమవుతున్నది. ఇది 2000 కిలోటన్నుల వార్షిక సామర్థ్యంతో ఏర్పాటు కానుంది.