Adani Group | న్యూఢిల్లీ, ఆగస్టు 3: కొద్దిరోజులుగా మార్కెట్లో విన్పిస్తున్న ఊహాగానాల ప్రకారమే అదానీ గ్రూప్ సంఘీ సిమెంట్ను చేజిక్కించుకుంది. గుజరాత్లోని కచ్ ప్రాంతంలో సిమెంట్ ప్లాంట్ నడుపుతున్న సంఘీ ఇండస్ట్రీస్ లిమిటెడ్లో మెజారిటీ వాటా కొనుగోలు చేస్తున్నట్టు గౌతమ్ అదానీ గ్రూప్ గురువారం ప్రకటించింది. ఈ ఏడాది జనవరిలో యూఎస్ హెడ్జ్ ఫండ్ హిండెన్బర్గ్ ఆరోపణలతో అతలాకుతలమైన తర్వాత అదానీ జరుపుతున్న తొలి టేకోవర్ ఇదే. ఈ లావాదేవీ కోసం సంఘీ ఇండస్ట్రీస్ ఎంటర్ప్రైజ్ విలువను రూ. 5,000 కోట్లుగా లెక్కించినట్టు అదానీ తెలిపింది. సంఘీ ఇండస్ట్రీస్ ప్రమోటర్ గ్రూప్లోని రవిసంఘీ, ఆయన కుటుంబం నుంచి అదానీ సిమెంట్లో భాగమైన అంబూజా సిమెంట్ 56.74 శాతం (14.66 కోట్ల షేర్లు) వాటాను షేరుకు రూ.114.22 ధరతో కొనుగోలు చేస్తుంది. ఇందుకు దాదాపు రూ. 1,675 కోట్లు చెల్లిస్తుంది. సంఘీ కుటుంబానికి ఇందులో 72.72 శాతం వాటా ఉండగా, మిగిలింది పబ్లిక్ వద్ద ఉంది. టేకోవర్ నిబంధనల ప్రకారం 26 శాతం (6.71 కోట్ల షేర్లు) వాటాను షేరుకు రూ.114.22 ధరతో పబ్లిక్ నుంచి కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్ జారీచేస్తుంది. ఓపెన్ ఆఫర్ కోసం రూ.767 కోట్లు ఖర్చుచేస్తుంది.
కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) అనుమతికి లోబడి వచ్చే 3-4 నెలల్లో టేకోవర్ పూర్తవుతుందని అదానీ గ్రూప్ తెలిపింది. ఓపెన్ ఆఫర్ పూర్తిగా సబ్స్క్రయిబ్ అయితే సంఘీ ఇండస్ట్రీస్లో మొత్తం 82.74 శాతం అదానీ చేతికి వస్తుంది. ఇందుకోసం ప్రమోటర్లకు, పబ్లిక్కు చెల్లించేందుకు దాదాపు రూ.2,440 కోట్లు ఖర్చుచేస్తుంది. కచ్ ప్రాంతంలోని సంఘిపురంలో సంఘీ ఇండస్ట్రీస్కు సిమెంట్ ఎగుమతుల కోసం ఒక సొంత పోర్ట్ కూడా ఉంది. ఈ రేవు సామర్థ్యాన్ని విస్తరించేందుకు పెట్టుబడులు చేస్తామని అదానీ పోర్ట్స్, స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఏపీసెజ్) సీఈవో కరణ్ అదానీ చెప్పారు. ఈ టేకోవర్తో తమ గ్రూప్ సిమెంట్ వార్షిక ఉత్పాదక సామర్థ్యం ప్రస్తుత 67.5 మిలియన్ టన్నుల నుంచి 73.6 మిలియన్ టన్నులకు పెరుగుతుందన్నారు.
గత ఏడాది అదానీ గ్రూప్ విదేశీ సంస్థ నుంచి అంబూజా సిమెంట్, ఏసీసీలను కొనుగోలు చేసిన సంగతి తెలిపిందే. సంఘీ ఇండస్ట్రీస్కు ఒక బిలియన్ టన్నుల సున్నపురాయి నిల్వలు ఉన్నందున, వచ్చే రెండేండ్లలో సంఘీపురం ప్లాంట్ సామర్థ్యాన్ని 15 మిలియన్ టన్నులకు పెంచుతామని కరణ్ అదానీ వివరించారు. ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో సంఘీ ఇండస్ట్రీస్ రూ.928.36 కోట్ల టర్నోవర్ సాధించింది. తాజా వార్త నేపథ్యంలో స్టాక్ ఎక్సేంజీల్లో సంఘీ ఇండస్ట్రీస్ షేరు 5 శాతం అప్పర్ సర్క్యూట్తో రూ.105 వద్ద ముగిసింది. దీంతో ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ.2,732 కోట్లకు చేరింది. అంబూజా సిమెంట్ షేరు 2.87 శాతం ర్యాలీ జరిపి రూ. 474 వద్ద ముగిసింది.