న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: అంబుజా, ఏసీసీల కొనుగోలుతో దేశీయ సిమెంట్ రంగంలోకి ప్రవేశించిన అదానీ గ్రూప్.. వైజాగ్ స్టీల్ను సొంతం చేసుకుని ఉక్కు తయారీలోకీ అడుగుపెట్టాలని భావిస్తున్నది. ప్రభుత్వ రంగ సంస్థ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్)లో 100 శాతం వాటాను అమ్మేయాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు నిర్ణయించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే వైజాగ్ స్టీల్ అమ్మకానికి సంబంధించి జరిగే బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొనాలని అదానీ గ్రూప్ చూస్తున్నట్టు సమాచారం. ఈ ఏడాది ఆఖర్లో వైజాగ్ స్టీల్ కోసం కేంద్రం బిడ్లను ఆహ్వానించే అవకాశాలూ కనిపిస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలో ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ.. ఆర్ఐఎన్ఎల్లో 100 శాతం ప్రభుత్వ వాటాల ఉపసంహరణకు ఆమోదం తెలిపింది. అనుబంధ సంస్థలు, జాయింట్ వెంచర్ల వాటాల విక్రయానికీ గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. ఇందులో భాగంగానే ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ, పెట్టుబడుల శాఖ ఆర్ఐఎన్ఎల్ ఆస్తుల విలువ లెక్కింపు కోసం దరఖాస్తులు ఆహ్వానించగా, ఏప్రిల్లో 10 సంస్థల నుంచి స్పందన వచ్చింది.
పోటీ సంస్థల కంటే దూకుడే..
స్టీల్ రంగంలోకి రావాలని చూస్తున్న అదానీ.. ఇప్పటికే ఈ రంగంలో ఉన్న ఇతర పోటీ సంస్థల కంటే దూకుడుగా వ్యవహరించాలని యోచిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ క్రమంలోనే జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, ఆర్సెలార్ మిట్టల్, నిప్పాన్ స్టీల్ వంటి అగ్రశ్రేణి సంస్థలతో పోల్చితే వైజాగ్ స్టీల్ కోసం అత్యధిక బిడ్నే దాఖలు చేయవచ్చని అంటున్నారు. ఎంత ఎక్కువ బిడ్ చేసైనాసరే ఆర్ఐఎన్ఎల్ను దక్కించుకోవాలని అదానీ గ్రూప్ చూస్తున్నట్టు చెప్తున్నారు. నిజానికి అంబుజా, ఏసీసీ సిమెంట్ సంస్థలను అధిక ధర చెల్లించే అదానీ సొంతం చేసుకున్నది.
తద్వారా దేశంలోనే రెండో అతిపెద్ద సిమెంట్ తయారీ గ్రూప్గా ఎదిగింది. అలాగే స్టీల్ రంగంలోకీ ఘనమైన ఎంట్రీనే ఇవ్వాలని, అందుకు వైజాగ్ స్టీల్ సరి అని అదానీ గట్టిగా భావిస్తున్నట్టు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. పైగా గంగవరం పోర్టుకు ఆర్ఐఎన్ఎల్ అనుసంధానంగా ఉండటం కూడా అదానీ గ్రూప్ అమితాసక్తికి కారణమవుతున్నది. ఈ పోర్టు.. అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ సొంతమన్నది తెలిసిందే. దీంతో వైజాగ్ స్టీల్ను కొంటే.. కోకింగ్ కోల్, ఐరన్ ఓర్ తదితర ముడి సరకు దిగుమతి అదానీకి తేలిక, చౌక కానున్నది.
2014 నుంచే నష్టాలెలా?
వైజాగ్ స్టీల్ నష్టాలు 2014 నుంచి మొదలయ్యాయి. ఈ ఏడాదే నరేంద్ర మోదీ సర్కారు కేంద్రంలో అధికారంలోకి రావడం గమనార్హం. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన దగ్గర్నుంచి సర్కారీ సంస్థల నిర్వీర్యానికే పెద్దపీట వేస్తున్న మోదీ.. బ్యాంకుల విలీనం-ప్రైవేటీకరణ, ఎయిర్ ఇండియా అమ్మకం, బడా కార్పొరేట్లకు అనుకూల విధానాలతో ముందుకెళ్తున్నదీ చూస్తూనే ఉన్నాం. దీంతో అప్పటిదాకా లాభాల్లో ఉన్న ఆర్ఐఎన్ఎల్.. ఉన్నట్టుండి నష్టాల్లోకి జారుకోవడం ఏంటన్నదానిపై రకరకాల అభిప్రాయాలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలావుంటే వైజాగ్ స్టీల్కు వేలాది ఎకరాల భూమి ఉన్న నేపథ్యంలో ఓ ప్రత్యేక సంస్థలోకి భూవనరులను మార్చి మరింత సొమ్ము చేసుకోవాలనీ కేంద్రంలోని బీజేపీ సర్కారు ఉన్నట్టు సమాచారం.