న్యూఢిల్లీ, జూలై 12: ఆ రంగం.. ఈ రంగం.. అన్న తేడా లేకుండా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూపోతున్న గౌతమ్ అదానీ.. రాబోయే స్పెక్ట్రం వేలంలోనూ పాల్గొనబోతున్నారు. 5జీ స్పెక్ట్రం కోసం బిడ్లు దాఖలు చేసిన సంస్థల్లో అదానీ డాటా నెట్వర్క్స్ ఉన్నట్టు టెలికం శాఖ మంగళవారం ప్రకటించింది. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు కూడా పోటీపడుతున్నట్టు స్పష్టం చేసింది. దీంతో ఈ నెల 26న మొదలుకానున్న స్పెక్ట్రం వేలం మిక్కిలి ప్రాధాన్యతను సంతరించుకున్నైట్టెంది. దేశీయ టెలికం పరిశ్రమలో ప్రస్తుతం జియో, ఎయిర్టెల్ మధ్య నువ్వా-నేనా అన్నట్టుగా పోటీ ఉన్న విషయం తెలిసిందే.
ఈ రెండు సంస్థల మధ్యే అగ్రస్థానం దోబూచులాడుతున్నది. ఇప్పుడు అదానీ రాకతో మార్కెట్లో ద్విముఖ పోరు కాస్తా.. త్రిముఖ పోరుగా మారనున్నదా?.. అన్న అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయిప్పుడు. అయితే ఈ స్పెక్ట్రంను తమ ఎయిర్పోర్టులు, విద్యుత్తు, డాటా సెంటర్ల వ్యాపారాల బలోపేతానికి వినియోగిస్తామని అదానీ అంటున్నది. అందుకే ఓ ప్రైవేట్ నెట్వర్క్ను ఏర్పాటు చేశామని చెప్తున్నది. కాగా, ఈసారి వేలంలో రూ.4.3 లక్షల కోట్ల విలువైన 72,097.85 మెగావాట్ల స్పెక్ట్రంను అమ్మకానికి పెడుతున్నారు. 600, 700, 800, 900, 1800, 2100, 2300 మెగాహెట్జ్ శ్రేణులతోపాటు 3300 మెగాహెట్జ్, 26 గిగాహెట్జ్ బ్యాండ్లలోని తరంగాలను విక్రయించనున్నారు. ఇక ఈ వేలంలో పాల్గొనాలని లేకపోతే బిడ్డింగ్ చేసిన కంపెనీలు ఈ నెల 19లోగా ఉపసంహరించుకోవచ్చు.