Adani | ముంబై, అక్టోబర్ 25: అదానీ గ్రూప్నకు దీర్ఘకాలంగా ఆడిటర్లుగా వ్యవహరిస్తున్న ఒక సంస్థపై అకౌంటింగ్ రెగ్యులేటర్ నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ (ఎన్ఎఫ్ఆర్ఏ) తాజాగా దృష్టిపెట్టింది. అదానీ కంపెనీలను ఆడిట్ చేసే ఎర్నస్ట్ అండ్ యంగ్ (ఈవై)కు ఇండియా సభ్య సంస్థ ఎస్ఆర్ బాట్లిబాయ్ వ్యవహారాలను ఎన్ఎఫ్ఆర్ఏ స్క్రూటినీ చేస్తున్నదని సంబంధిత వర్గాల్ని ఉటంకిస్తూ ఎకానమిక్ టైమ్స్ బుధవారం ఒక కథనాన్ని వెలువరించింది. ఈ ఆడిటింగ్ సంస్థపై కొద్దివారాల క్రితం దర్యాప్తు ప్రారంభించిందని, కొన్ని అదానీ గ్రూప్ కంపెనీల ఆడిట్స్కు సంబంధించిన ఫైళ్లు, కమ్యూనికేషన్లు సమర్పించమంటూ రెగ్యులేటర్ ఆదేశించిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. 2014 సంవత్సరం నుంచి ఆడిట్ ఫైళ్లు కోరినట్టు సమాచారం. ఈ అంశంపై ఈవై, ఎస్ఆర్ బాట్లిబాయ్ ప్రతినిధులు వ్యాఖ్యానించేందుకు నిరాకరించగా, ఎన్ఎఫ్ఆర్ఏ, అదానీ గ్రూప్లు స్పందన వెల్లడించలేదని ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది. అంతర్జాతీయ ఆడిటింగ్ దిగ్గజం ఈవైకు ఎస్ఆర్ బాట్లిబాయ్ ఇండియాలో సభ్య సంస్థగా కొనసాగుతున్నది. విదేశీ అకౌంటింగ్ సంస్థలు భారత్లో ఆడిటర్లుగా రిజిష్టర్కావడానికి చట్టం అనుమతించదు. అందుచేత ఈవైతో సహా నాలుగు అంతర్జాతీయ ఆడిటింగ్ దిగ్గజాలు ఇక్కడి సభ్య సంస్థల ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తుంటాయి.
ఎస్ఆర్ బాట్లిబాయ్ ఐదు అదానీ లిస్టెడ్ కంపెనీలకు ఆడిటర్గా పనిచేస్తున్నది. అదానీ పవర్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ విల్మార్లతో పాటు గత ఏడాది హోల్సిమ్ నుంచి అదానీ గ్రూప్ కొనుగోలు చేసిన సిమెంట్ కంపెనీలు అంబూజా సిమెంట్స్, ఏసీసీలకు ఈ సంస్థే గత కొద్ది సంవత్సరాలుగా ఆడిటర్. గత ఏడాది అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ ఖాతా పుస్తకాలపై సైతం ఎస్ఆర్ బాట్లిబాయ్ సంతకాలు చేసింది. అదానీ గ్రూప్ అకౌంటింగ్, డిస్క్లోజర్లపై ఈ ఏడాది జనవరిలో యూఎస్ హెడ్జ్ ఫండ్ హిండెన్బర్గ్ పలు ప్రశ్నలను లేవనెత్తిన నేపథ్యంలో ఎస్ఆర్ బాట్లిబాయ్ ఆడిటింగ్ వ్యవహారాల్ని రెగ్యులేటర్ దర్యాప్తు చేస్తుండటం గమనార్హం. అప్పట్లో హిండెన్బర్గ్ ప్రశ్నలకు అదానీ గ్రూప్ స్పందిస్తూ తమ కంపెనీలను సర్టిఫైడ్, క్వాలిఫైడ్ వృత్తినిపుణులు ఆడిట్ చేశారని పేర్కొన్నది. ఆ వృత్తి నిపుణుల ఆడిట్పైనే రెగ్యులేటర్ ప్రస్తుతం దృష్టి సారించింది.
కొద్ది నెలల క్రితం అదానీ టోటల్ గ్యాస్ తన ఆడిటర్ను మార్చింది. పలు అదానీ కంపెనీలకు దీర్ఘకాలంగా ఆడిటర్గా ఉన్న షా ధన్ధారియా అండ్ కో స్థానంలో కొత్త ఆడిటర్గా వాకర్ చాందియోక్ అండ్ కో ఎల్ఎల్పీని నియమించుకున్నట్టు ఈ ఏడాది మే 2న అదానీ టోటల్ వెల్లడించింది. ఇటువంటి పెద్ద అసైన్మెంట్లు చేయడానికి షా ధన్ధారియా చాలా చిన్నదంటూ హిండెన్బర్గ్ పేర్కొన్న నేపథ్యంలో ఈ మార్పు జరగడం గమనార్హం.
అదానీ పోర్ట్స్ కొన్ని సంస్థలతో జరిపిన లావాదేవీలకు తగిన డాక్యుమెంట్లు ఇవ్వలేదంటూ ఇటీవల డెలాయిట్ హాస్కిన్స్ అండ్ సెల్స్ ఎల్ఎల్పీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సంస్థ ఆగస్టులో ఆడిటర్గా వైదొలిగింది. కొద్ది సంవత్సరాలుగా అదానీ..గ్రూప్ కంపెనీలనే క్లయింట్లుగా చూపిస్తూ భారీ రుణాలు సేకరిస్తూ విస్తరణ జరుపుతున్న వైనంపై కొంతమంది ఆడిటర్లు జాగ్రత్త వహిస్తున్నట్టు బ్లూంబర్గ్ వార్తా సంస్థ తెలిపింది. అదానీ గ్రూప్ కంపెనీల్లో అదానీ పవర్కు దీర్ఘకాలంగా ఆడిటర్గా వ్యవహరిస్తున్న ఎస్ఆర్ బాట్లిబాయ్ ఇటీవల పలు అకౌంటింగ్ అంశాల్ని లేవనెత్తింది. ప్రత్యేకించి 2028 నుంచి భారీ నష్టాల్ని చవిచూస్తున్న విద్యుత్ ప్లాంట్ ఓవర్ వేల్యుయేషన్ పట్ల ఆడిటర్గా తన ఆందోళనను వ్యక్తం చేస్తున్నది. అంతకాలంగా ఒక అంశంపై ఏకీభవించకుండా ఆడిటర్ కొనసాగడం అసాధారణమని బ్లూంబర్గ్ వ్యాఖ్యానించింది. అకౌంటింగ్ పరిశ్రమను పర్యవేక్షించడానికి 2018లో ఏర్పాటైన ఎన్ఎఫ్ఆర్ఏ వృత్తి ప్రమాణాల్ని, చట్టాల్ని కఠినంగా అమలు చేస్తున్నది.
ఆడిటింగ్ పొరపాట్లు కనుగొంటే ఆయా సంస్థలకు జరిమానా విధించడమే కాకుండా డిబార్ కూడా చేస్తుంది. గత ఐదేండ్లలో ఇది 40 మందికిపైగా వృత్తి నిపుణుల్ని డిబార్ చేసింది. ఇప్పటికే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఐఎల్ అండ్ ఎఫ్ఎస్) అకౌంటింగ్ కుంభకోణం నేపథ్యంలో ఎస్ఆర్ బాట్లిబాయ్కి రెగ్యులేటర్ సెగ తగిలింది. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ఖాతా పుస్తకాల్ని ఆడిట్ చేసిన ఎస్ఆర్ బాట్లిబాయ్ బేసిక్ ఆడిట్ నిబంధనల్ని పాటించలేదంటూ ఆ కంపెనీ ఆడిటర్ పదవి నుంచి తొలగించింది.