న్యూఢిల్లీ, డిసెంబర్ 28: రైతుల పొట్ట కొడుతున్న నరేంద్ర మోదీ సర్కార్ మరో షాకివ్వడానికి సిద్ధమవుతున్నది. దేశవ్యాప్తంగా స్మార్ట్ మీటర్లను ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతున్నది. దేశవ్యాప్తంగా స్మార్ట్మీటర్ల అమర్చడానికి కేంద్ర ప్రభుత్వం లక్ష కోట్లకు పైగా వ్యయంతో స్కీంను సిద్ధం చేసింది. ఈ స్కీంలో భాగంగా ఇప్పటికే ముంబై నుంచి రూ.1,300 కోట్ల కాంట్రాక్టును రెండు నెలల క్రితం దక్కించుకున్న అదానీ గ్రూపు..భవిష్యత్తులో దేశవ్యాప్తంగా మరిన్ని కాంట్రాక్టులు సాధించేందుకు ప్రత్యేకంగా ఓ కంపెనీని ఏర్పాటు చేశారు.
ఈ ప్రతిపాదిత వ్యయంలో అధిక శాతం వాటాను నరేంద్ర మోదీ వ్యాపార మిత్రుడుగా పేరొందిన గౌతమ్ అదానీ చేజిక్కించుకునేందుకు శ్రీకారం చుట్టడం గమనార్హం. ముంబైలో విద్యుత్ను సరఫరా చేసే బెస్ట్ (బీఈఎస్టీ) నుంచి స్మార్ట్మీటర్లు అమర్చేందుకు రెండు నెలల క్రితం కాంట్రాక్ట్ పొందిన అదానీ గ్రూప్ తాజాగా ఈ వ్యాపారం కోసం బెస్ట్ స్మార్ట్ మీటరింగ్ లిమిటెడ్ (బీఎస్ఎంఎల్) పేరుతో ఒక సబ్సిడరీ కంపెనీని ఏర్పాటు చేసింది. గుజరాత్లో అహ్మదాబాద్లోని రిజిష్ర్టార్ ఆఫ్ కంపెనీస్ వద్ద కొత్త కంపెనీని డిసెంబర్ 27న రిజిష్టర్ చేసింది. ఈ మేరకు అదానీ గ్రూప్ కంపెనీ అదానీ ట్రాన్స్మిషన్ బుధవారం స్టాక్ ఎక్సేంజీలకు సమాచారం ఇచ్చింది.
బీఎస్ఎంఎల్. బెస్ట్ నుంచి రూ.1,300 కోట్ల కాంట్రాక్టును అక్టోబర్లో పొందిన అదానీ ట్రాన్స్మిషన్కు కొత్త కంపెనీ సబ్సిడరీగా ఏర్పాటయ్యింది. కొత్త కంపెనీలో ఒక లక్ష రూపాయిల నూరుశాతం ఈక్విటీ మూలధనం అదానీ ట్రాన్స్మిషన్ వద్ద ఉంటుంది. ఇందులో రూ.10 ముఖవిలువగల 10,000 షేర్లు ఉంటాయి. తగిన మౌలిక సదుపాయాల్ని కల్పించడం ద్వారా డిస్కంల నిర్వహణా సామర్థ్యాన్ని, ఆర్థిక సత్తాను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆర్డీఎస్ఎస్ స్కీములో భాగంగా స్మార్ట్ మీటర్లు నెలకొల్పాలని ప్రతిపాదించారు. 2021-22 నుంచి 2025-26 మధ్యకాలంలో 25 కోట్ల ప్రి-పెయిడ్ స్మార్ట్మీటర్లు అమర్చాలన్నది లక్ష్యం. ఇందుకోసం 23 రాష్ర్టాలు/40 డిస్కంలకు రూ.1,15,493 కోట్ల వ్యయాన్ని మంజూరుచేసింది.