IT Services | న్యూఢిల్లీ, జూన్ 22: ఆర్థిక అనిశ్చితి కారణంగా ఐటీ సర్వీసులకు డిమాండ్ అంతంతగానే ఉన్నదని మరో దిగ్గజ ఐటీ కంపెనీ ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే ఈ అంశాన్ని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), కాగ్నిజెంట్ టెక్నాలజీలు వెల్లడించగా, తాజాగా ప్రపంచంలో అతిపెద్ద ఐటీ సర్వీసుల కంపెనీ యాక్సెంచర్ తన ఆదాయ అంచనాలతో మార్కెట్ నిపుణులకు షాకిచ్చింది. ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులతో ఐటీ బడ్జెట్లు తగ్గుతున్నాయని, కొత్త కాంట్రాక్టులపై సంతకాలు చేసేందుకు క్లయింట్లు వెనుకంజ వేస్తున్నారని తెలిపింది.
ఐటీ కన్సల్టింగ్ సర్వీసులకు ప్రధాన మార్కెట్ అయిన అమెరికాలో ఈ సేవలకు డిమాండ్ బలహీనంగా ఉందని వివరించింది. ఈ నేపథ్యంలో నాల్గవ త్రైమాసికంలో తమ ఆదాయం 15.75 బిలియన్ డాలర్ల నుంచి 16.35 బిలియన్ డాలర్లకు పరిమితమవుతుందంటూ యాక్సెంచర్ అంచనాల్ని వెల్లడించింది. ఇది మార్కెట్ అంచనాలకంటే తక్కువ. అలాగే మూడవ త్రైమాసికంలో ఆర్జించిన 16.56 బిలియన్ డాలర్ల ఆదాయం కంటే తక్కువే. దీంతో నాస్డాక్ లిస్టెడ్ కంపెనీ యాక్సెంచర్ షేరు గురువారం 5 శాతంపైగా నష్టపోయింది. దేశీ మార్కెట్లో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్ తదితర షేర్లు నష్టాలకు లోనయ్యాయి. హైదరాబాద్తో సహా పలు నగరాల్లో సెంటర్లు కలిగిన యాక్సెంచర్కు ఇండియాలో 3.5 లక్షల మంది ఉద్యోగులున్నారు.
టీసీఎస్దీ ఇదే మాట
అధిక వడ్డీ రేట్లతో యూఎస్ ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతున్నందున ఐటీ బడ్జెట్లపై క్లయింట్లు వెనక్కు మళ్లుతున్నారు. కొద్ది రోజుల క్రితమే టీసీఎస్తో 2 బిలియన్ డాలర్ల కాంట్రాక్టును ఇన్సూరెన్స్ కంపెనీ ట్రాన్స్అమెరికా రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. యూఎస్ అంచనాలకు తగ్గట్టు కోలుకోవడం లేదని, పైగా బలహీనపడుతున్నదంటూ టీసీఎస్ ఆందోళనల్ని వెలిబుచ్చింది. అధిక ధర ఉన్న ఉత్పత్తుల అమ్మకాలు మందగిస్తున్నందున, చిన్న చిన్న ఐటీ కాంట్రాక్టులు సంపాదించలేకపోతున్నామని మరో ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ కూడా తెలిపింది.