హైదరాబాద్, మార్చి 24: ఎయిర్ కండిషనర్ల(ఏసీ) ధరలకు రెక్కలొచ్చాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా కమోడిటీ ఉత్పత్తులు భగ్గుమనడంతో దేశవ్యాప్తంగా ఏసీ ధరలు భారీగా పెంచుతున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు 10 శాతం వరకు ధరలు పెంచుతున్నట్టు ప్రకటించగా.. తాజాగా ఈ జాబితాలోకి ప్రముఖ ఏసీల తయారీ సంస్థ బ్లూస్టార్ కూడా చేరింది.
కంపెనీకి చెందిన ఏసీల ధరలను 12 శాతం వరకు పెంచుతున్నట్టు కంపెనీ గ్రూపు ప్రెసిడెంట్ మోహిత్ సుద్ తెలిపారు. రాగి, అల్యూమినియంతోపాటు నూతన విద్యుత్ నిబంధనలు అమలు చేయడంతో సంస్థపై పడుతున్న భారాన్ని తగ్గించుకోవడంలో భాగంగా ఏసీల ధరలను పెంచాల్సి వస్తున్నదన్నారు. దీంతో ఫైవ్-స్టార్ ఏసీలు కనిష్ఠంగా 5 శాతం వరకు గరిష్ఠంగా 15 శాతం వరకు సవరించినట్టు చెప్పారు. జీఎస్టీని 10 శాతానికి తగ్గించడంతో ఏసీల ధరలు దిగొచ్చాయని, కానీ యుద్ధ ప్రభావంతో వీటి ధరలు 15 శాతం పెరగడంతో మొత్తంగా గతేడాదితో పోలిస్తే వీటి ధరలు 5 శాతం వరకు అధికమయ్యాయన్నారు.
రాష్ట్ర మార్కెట్లోకి నూతన శ్రేణి రూమ్ 125 రకాల ఏసీలను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది ఏసీల అమ్మకాలు 5 శాతం పడిపోయే అవకాశాలున్నాయని, ప్రధానంగా ధరలు పెరుగడం, వర్షాభావ పరిస్థితులు కూడా మరో కారణమన్నారు.